Pawan Kalyan : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులెవ్వరూ సంతోషంగా లేరన్నారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకునేవారే లేరని మండిపడ్డారు. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి మాత్రం అధికారులు వస్తారని ఆరోపించారు.
వైసీపీని అధికారంలోకి రానివ్వం..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని పవన్ స్పష్టం చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత ప్రజలదేనని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు. బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమిషన్లు కొట్టే రకం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్డు మీదకు వచ్చి పోరాడుతున్నానని అన్నారు. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని పవన్ మరోసారి స్పష్టం చేశారు.
వైసీపీ నేతలకు కౌంటర్
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కాబట్టి అవినీతికి వైసీపీ హాలీడే ప్రకటించిందని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఘాటుగా విమర్శలు చేశారు. తనను వీకెండ్ పొలిటిషీయన్ అని అంటున్నారని మండిపడ్డారు. కాపు నాయకులతో తిట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎలా తిరుగుతానో చూస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని.. వారానికి ఒక్కరోజు వస్తేనే వాళ్లు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. తన వద్ద తాతలు సంపాదించిన రూ.వేల కోట్లు లేవన్నారు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు లేదని స్పష్టం చేశారు. తన కష్టార్జితంతో రైతులకు సాయం చేస్తున్నానని పవన్ తెలిపారు.
అంబటిపై సెటైర్లు
మంత్రి అంబటి రాంబాబును జనసేనాని టార్గెట్ చేశారు. అవినీతి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని అన్నారు. పోలవరం పూర్తి చేయటం తెలియని నీటిపారుదల మంత్రి అని విమర్శలు చేశారు.
జనసేనలో చేరికలు
మరోవైపు పవన్ కల్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కండువా కప్పి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేనలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యలకు పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.