Telangana Congress : సేవ్ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్లో కల్లోలం రేపిన సీనియర్లకు… రేవంత్ వర్గం నేతలు దీటైన కౌంటర్ ఇచ్చారు. కొత్త కమిటీల్లో తమకు కల్పించిన పదవులకు రాజీనామా చేశారు. తాజా పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు లేఖ రాసిన నేతలు… రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వివరించారు.
తమకు పదవులు ముఖ్యం కాదని.. రేవంత్ నాయకత్వంలో… పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతోనే తాము పార్టీలోకి వచ్చామని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమకు పదవులు ఇవ్వడమే సీనియర్లకు అభ్యంతరమైతే.. అలాంటి పదవులు తమకు అవసరం లేదంటూ ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను హైకమాండ్కు పంపనున్నారు.
టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని… ఎప్పుడు కేసీఆర్ను గద్దె దించేద్దామా అని చూస్తున్నారని… రేవంత్ వర్గం నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కలసికట్టుగా పోరాటం చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి ఇది సరైన సమయమని… ఇలాంటి కీలక సమయంలో సీనియర్లు గందరగోళం సృష్టించడం సరైనది కాదని అంటున్నారు.
పార్టీలో వరుస సంక్షోభాలతో ప్రజల్లో చులకన అవుతున్నామంటూ రేవంత్ వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంతో పదవులు కట్టబెట్టిన హైకమాండ్కు ధన్యవాదాలు చెబుతూనే.. పీసీసీ కమిటీల్లోని తమ పదవులకు రాజీనామా సమర్పిస్తున్నట్లు రేవంత్ వర్గం నేతలు తమ లేఖలో వెల్లడించారు.