Chandrababu : పల్నాడులో జరిగిన అల్లర్లపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అటు పోలీసుల తీరును తప్పుపట్టారు. ఎస్పీ రవిశంకర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైసీపీ అరాచక శక్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీని విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి అధికారులతో పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు అన్నారు.
మాచర్లలో జరిగినవి చిన్నచిన్న ఘటనలేనని ఎస్పీ రవిశంకర్ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తున్నాయి. గతంలో ఫ్యాక్షన్ చరిత్ర కలిగినవారు, హత్యలు, కిరాయిహత్యలు చేసినవారు ఉన్నారనే సమాచారంతో శుక్రవారం మాచర్లలోని 7వ వార్డులోని కార్డన్ సెర్చ్ చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్పీ అన్నారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఫ్యాక్షనిజంతో సంబంధమున్న వారు పాల్గొన్నారని ఎస్పీ ప్రకటన చేశారు. ఈ క్రమంలో రెండువర్గాలు ఎదురుపడి పరస్పరం రెచ్చగొట్టేలా మాట్లాడుకోవడం గొడవలకు దారితీసిందని తెలిపారు.
ఎస్పీ వ్యాఖ్యలను టీడీపీ వర్గాలు తప్పుపట్టాయి. ఘటన తీవ్రతను తక్కువ చేసేందుకు ఎస్పీ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పట్టణ నడిబొడ్డునే అత్యంత కిరాతకంగా.. బండ రాళ్లతో దాడులు చేశారని తెలిపారు. తెలుగుదేశం నాయకుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. మహిళలను ఇళ్ల నుంచి తరిమేశారని, బంగారం, నగదుతోపాటు ఆస్తుల దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ పాలనలో శాంతిభద్రతల తీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని అంటున్నారు. ఇంత విధ్వంసం జరిగినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మళ్లీ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.