Narendra Modi from chaiwala to hattrick prime minister: 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో 74 సంవత్సరాల వయసున్న ఆయన హ్యాట్రిక్ రికార్డు సాధించారు. జవహర్ లాల్ నెహ్రూ కు తప్ప ఏ ఒక్కరికీ దక్కని రికార్డు సృష్టించారాయన. నేడు ఆయన పుట్టినరోజు ..ఈ సందర్భంగా ఆయన గురించి అరుదైన విషయాలు మీ కోసం.
బాల్యం నుంచే బాధ్యతలు
మోదీ గురించి ప్రచారంలో ఉన్న వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంవత్సరంలో పుట్టారు మోదీ. బాల్యం నుంచి దేశభక్తి ఎక్కువే. నిరుపేద కుటుంబంలో పుట్టిన మోదీ చిన్నతనం నుంచి తండ్రికి ఉన్న రైల్వే క్యాంటీన్ లో సాయం చేసేవారు. బాల్యంలో తమ ఇంటి గోడను బాగుచేయించడానికి డబ్బులు కావలసి వచ్చింది. ఎవరినీ చేయిచాచకుండా అందుకోసం నాటకాలు వేస్తూ వాళ్లిచ్చిన డబ్బులు కొద్దికొద్దిగా కూడబెట్టుకుని ఇంటి గోడను కట్టించుకున్నారు.
మోదికి చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసం మెండు అని అంటారు. బాల్యంలోనే హిందూ పురాణాలు, చరిత్ర తెలుసుకోవాలనే జిజ్ణాస కూడా ఎక్కువగా ఉండేదట. ఎనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ ఆశయాలకు ఆకర్షితులయ్యారని సమాచారం. అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ లో జూనియర్ క్యాడెట్ గా చేరారని ఆయన ఆప్తులు చెబుతుంటారు. క్రమశిక్షణ కలిగిన క్యాడెట్ గా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ప్రజా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారట.
సన్యాసం తీసుకోవాలని..
మోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 1950 సెప్టెంబర్ 17న పుట్టారు. 17 ఏళ్ల వయసులో ఉత్తర భారత దేశం పర్యటన చేశారు. అప్పట్లో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని అనుకున్నారు. అయితే కొన్ని నిబంధనలు ఆటంకం కావడంతో కొంతకాలం రామకృష్ణ మఠంలో చేరి అక్కడ ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. నాలుగేళ్లు అవిశ్రాంతంగా ఉత్తర భారత దేశం అంతటా తిరిగారు. కుటుంబ పోషణ నిమిత్తం తల్లి ఆశీస్సులు తీసుకుని తన మేనమామ నడుపుతున్న చాయ్ దుకాణంలో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అప్పుడే పలువురు రాజకీయ, కార్మిక నేతలు, సంఘ్ పరివార్ పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారితో ఏర్పడ్డ సాన్నిహిత్యంతో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు బలపరుచుకున్నారు. 1986 సంవత్సరంలో బీజేపీ సిద్దాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీలో చేరిన అనతి కాలంలోనే అహ్మదాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు.
Also Read: కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్.. రాజీనామా ప్రకటన వెనుక అసలు సంగతి ఇదా ?
పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి..
నాటి జాతీయ నాయకుడు ఎల్ కే అద్వానీ మోదీలో చురుకుతనం గుర్తించారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ప్రధాన కార్యదర్శి హోదా మోదీకి అప్పగించారు. అంతేకాదు అద్వానీ 1990లో చేట్టిన అయోధ్య రథయాత్రకు సంబంధించి గుజరాత్ రాష్ట్ర ఇన్ ఛార్జిగా మోదీని నియమించారు. 1993 నుంచి తనకు అప్పగించిన పార్టీ సారధ్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు మోదీ. గుజరాత్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన చేసిన నిర్విరామ కృషి 1995లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేసింది. ఒక్కసారిగా మోదీ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది.
మోదీని అప్పటి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం ఆయనను ఇన్ చార్జిగా నియమించింది. మోదీ ఇన్ ఛార్జిగా చేసిన ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీ పార్టీలో అత్యంత కీలక సేవలు అందించిన మోదీ శ్రమను పార్టీ గుర్తించింది. 1998 సంవత్సరంలో నరేంద్ర మోదీని జాతీయ కార్యదర్శిగా నియమించింది. అదే సంవత్సరం గుజరాత్ శాసన సభకు జరిగిన ఎన్నికలలో పార్టీ సీనియర్ నేత కేశూభాయ్ పటేల్ ను ముఖ్యమంత్రిగా చేయడంలో మోదీ పరోక్ష పాత్ర పోషించారు.
అయితే గుజరాత్ లో సంభవించిన భారీ భూకంపంతో కుచ్ ప్రాంతం అల్లకల్లోలం అయింది.
15వ భారత ప్రధానిగా..
సహాయక కార్యక్రమాలు సకాలంలో అందించడంలో కేశూభాయ్ ప్రభుత్వం విఫలమయిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో బీజేపీ అధిష్టానం 2001లో మోదీని గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అలా 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా చేపట్టి 2014 దాకా వరుసగా నాలుగు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. మోదీకి పెరిగిపోయిన గ్రాఫ్ తో దేశమంతటా అన్ని రాష్ట్రాల సర్వేలలో నంబర్ వన్ ముఖ్యమంత్రిగా మోదీ పేరు తెచ్చుకున్నారు. క్రమంగా జాతీయ పార్టీ నరేంద్ర మోదీని 2014లో జరిగిన ఎన్నికలలో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. అలా భారత 15వ ప్రధానమంత్రిగా మోదీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుండి నేటి వరకూ హ్యాట్రిక్ విజయాలతో ప్రధానిగా కొనసాగుతున్నారు. అయితే, గతంతో పోల్చితే.. ఇప్పుడు ఆయన గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది ఎన్నికల్లో బీజేపీ దాదాపు దుకాణం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్కు లభిస్తున్న ప్రజాధారణే ఇందుకు కారణం. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా మాయమై.. కాంగ్రెస్ జెండా పాతడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.