Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం నామినేషన్స్ చాలా ‘చెత్త’గా జరిగాయి. కంటెస్టెంట్స్ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి తలపై చెత్త వేయాలి. ఈ నామినేషన్స్లో కూడా కొందరి నిజస్వరూపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అందరితో బాగున్నట్టు నటించే ఆదిత్య ఓం కూడా ఈ నామినేషన్స్లో తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. గతవారంలో తను నామినేట్ చేసిన శేఖర్ భాషా.. ఇప్పుడు హౌజ్లో నుండి ఔట్ అయిపోయాడు. ఇప్పుడు మణికంఠతో మంచిగా ఉన్నట్టు నటిస్తే తనను కూడా ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ నామినేషన్స్లో యష్మీతో ఇతర కంటెస్టెంట్స్కు జరిగిన గొడవ హైలెట్గా నిలిచింది.
అతడిని రెచ్చగొట్టింది
ముందుగా మణికంఠ వచ్చి యష్మీని నామినేట్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇతరులు మాట్లాడేది వినదని, తనను మొదటి నామినేషన్స్లో కావాలనే నామినేట్ చేసిందని పాయింట్స్ చెప్పాడు. దానికి యష్మీ పర్సనల్ అటాక్ మొదలుపెట్టింది. మణిని ఫ్రెండ్ అనుకొని మోసపోయానని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. గేమ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు అని మణి చెప్పినా సరే వినకుండా తనపై అరిచింది. నువ్వు చెప్పే బొక్కలో పాయింట్స్ వినడానికి రెడీగా లేను అంటూ నోరుజారింది. డ్రామాలు చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ అనే పదాన్ని వాడుకుంటున్నావు, నీకు దమ్ము లేదా అంటూ మణిని రెచ్చగొట్టింది. ఫ్రెండ్షిప్ గురించి నామినేషన్స్లో తీసుకొచ్చినందుకు విక్టిమ్ కార్డ్ వాడొద్దని మణికంఠ అన్నాడు.
Also Read: అన్యాయంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాషా.. ఎంత రెమ్యునరేషన్తో ఇంటికి వెళ్లాడంటే?
లక్లో చీఫ్
మణికంఠతో పాటు సీత, విష్ణుప్రియా, నబీల్, సోనియా కూడా యష్మీనే నామినేట్ చేశారు. మణికంఠతో పాటు సోనియాతో కూడా నామినేషన్స్ విషయంలో అదే రేంజ్లో ఫైట్ చేసింది యష్మీ. లక్లో చీఫ్ అయ్యాను అంటూ యష్మీ అన్న మాటలను తనకు గుర్తుచేసింది సోనియా. తన మైండ్, ఎమోషన్స్ పాజిటివ్గా లేవని, నెగిటివ్గా ఉన్నాయని, అలా ఉండడం వల్ల కేవలం బిగ్ బాస్ హౌజ్లోనే కాదు బయట ప్రపంచంలో కూడా తనకు మంచిది కాదంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. దానికి యష్మీ కూడా మాటకు మాట అనడం మొదలుపెట్టింది. సోనియాను స్ట్రాంగ్ అనుకున్నానని, అందుకే టీమ్లోకి తీసుకున్నానని గుర్తుచేసింది యష్మీ.
పెరిగిన నెగిటివిటీ
మొత్తానికి అయిదుగురి ఓట్లతో యష్మీ.. మొదటిసారి నామినేషన్స్లోకి వచ్చింది. రెండువారాలుగా తను చీఫ్ స్థానంలో ఉండడం వల్ల నామినేషన్స్ నుండి తప్పించుకుంది. ఈ రెండు వారాల్లోనే చీఫ్గా తను చేసిన పనులకు ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా తోటి కంటెస్టెంట్స్లో కూడా నెగిటివిటీ పెరిగిపోయింది. ఆ నెగిటివిటీ ఏ రేంజ్లో ఉందో యష్మీకి ఇప్పుడు అర్థమయ్యింది. సోనియా తనపై పర్సనల్ అటాక్ చేస్తూ నామినేట్ చేయడం తట్టుకోలేక ఏడ్చేసింది. ఏడుస్తున్నప్పుడు కూడా ఛాన్స్ వస్తే సోనియా మొహం పగలగొడతానని, తన ఇంట్లో తనను అలా ఫేక్గా పెంచారేమో కానీ మా ఇంట్లో అలా పెంచలేదు అంటూ వ్యాఖ్యలు చేసింది యష్మీ. అది గమనించిన సోనియా.. తన దగ్గరకు వచ్చి ఓదార్చాలని చూసినా వినలేదు.