Manchu Vishnu: ప్రస్తుతం మంచు ఫ్యామిలీ అంతా పూర్తిగా ‘కన్నప్ప’ సినిమాపై ఫోకస్ పెట్టారు. తెలుగు సినిమా స్థాయిని ఇంకా పెంచాలనే కోరికతో రూ.500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా తాను కన్నప్ప పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, రిలీజ్ ఎప్పుడు లాంటి విషయాలను మంచు ఫ్యామిలీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా తన స్పెషల్ ఫ్రెండ్ను తన ఫాలోవర్స్కు పరిచయం చేస్తూ ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు మంచు విష్ణు.
హాలీవుడ్ టెక్నీషియన్లు
‘కన్నప్ప’ సినిమాలో మంచు విష్ణు క్యారెక్టర్ కోసం ఒక ప్రత్యేకమైన గుర్రం ఉంటుంది. అయితే ఆ గుర్రం గురించి పరిచయం చేస్తూ ప్రత్యేకంగా ఒక పోస్ట్ షేర్ చేశాడు ఈ హీరో. ‘టిక్కీని కలవండి. కన్నప్పలో తనే నా సోదరుడు, నా బెస్ట్ ఫ్రెండ్. నిజ జీవితంలో తను ఒక అద్భుతమైన గుర్రం. మునుపెన్నడూ చేయని స్టంట్స్ను నాతో చేయించింది’ అని చెప్పుకొచ్చాడు. ‘కన్నప్ప’ మూవీని మంచు ఫ్యామిలీ అంతా చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది. అందుకే మూవీ కోసం బాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా హాలీవుడ్ నుండి కూడా టెక్నీషియన్లను రంగంలోకి దించాడు మంచు విష్ణు. సినిమాటోగ్రాఫర్, స్టంట్ మ్యాన్.. ఇలా చాలామందిని హాలీవుడ్ నుండే తీసుకొచ్చారు.
Also Read: విష్ణుగారూ వినండి వీళ్ల గోడు.. టాలీవుడ్లోనూ మృగాలున్నాయ్, కమిటీ వేస్తారా?
టీజర్తో హైప్
‘కన్నప్ప’ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోయినా అప్పుడే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశాడు మంచు విష్ణు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్కు ఈ టీజర్ను చూపించి వారి చేత ప్రశంసలు అందుకున్నాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీజర్ విడుదలయిన కొన్నిరోజులకే ఈ టీజర్ను అందరు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. చాలామంది ఈ టీజర్ను ట్రోల్ చేస్తున్నా కూడా అసలు రూ. 500 కోట్ల బడ్జెట్తో మంచు ఫ్యామిలీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎలా ఉందో చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దానికి ముఖ్య కారణం ‘కన్నప్ప’ కోసం విష్ణు ఎంపిక చేసిన భారీ క్యాస్టింగ్.
ప్రముఖ స్టార్లు ఒకేచోట
‘కన్నప్ప’ కోసం సౌత్లోని పలువురు స్టార్లను రంగంలోకి దించాడు మంచు విష్ణు. మంచు విష్ణు కన్నప్పగా నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో శరత్ కుమార్, మోహన్ లాల్ లాంటి సౌత్ స్టార్లతో పాటు అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ హీరో కూడా కనిపించనున్నాడు. ముందుగా ‘కన్నప్ప’లో ప్రభాస్ను మహాశివుడి పాత్ర కోసం అప్రోచ్ అయ్యాడు మంచు విష్ణు. కానీ ప్రభాస్కు వేరే పాత్ర నచ్చడంతో శివుడి క్యారెక్టర్ అక్షయ్ కుమార్ చేతుల్లోకి వెళ్లింది. ఇటీవల అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ను విడుదల చేసి తనే శివుడు అని చెప్పకనే చెప్పింది ‘కన్నప్ప’ టీమ్. ఈ మూవీలో మధు లాంటి సీనియర్ హీరోయిన్లతో పాటు ఐశ్వర్య భాస్కరన్, ప్రీతి ముకుందన్ లాంటి యంగ్ హీరోయిన్లు కూడా భాగమయ్యారు.