Ex central minister yashwant Sinha announce new political party: కేంద్ర మాజీ మంత్రి గత కొంతకాలంగా కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయూ సిద్ధాంతాలను అనుగుణంగా ‘అటల్ విచార్ మంచ్’ (ఏవీఎం) పార్టీని ప్రకటించారు.బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు యశ్వంత్ సిన్హా. ఐఎస్ అధికారిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన నేత యశ్వంత్ సిన్హా. 1984లో తన పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చారు. అప్పటి జనతా పార్టీ ఆశయాల కోసం పనిచేశారు.
మూడు పర్యాయాలు ఎంపీగా
హజారీబాగ్ లోక్ సభ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అంతేకాదు వాజ్ పేయి భారత ప్రధానిగా ఉన్న టైమ్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మోదీ సిద్ధాంతాలతో ఏకీభవించక బీజేపీ నుంచి స్వచ్ఛందంగా బయటకి వచ్చేశారు. యశ్వంత్ సిన్హా పెద్ద కుమారుడు జయంత్ సిన్హా బీజేపీలోనే కొనసాగుతున్నారు. రీసెంట్ గా 2014 ఎన్నికలలో బీజేపీ తరపున గెలుపొందారు. అవకాశం దొరికినప్పుడల్లా మోదీని విమర్శిస్తూ వచ్చారు యశ్వంత్ సిన్హా. అయితే 2021 నుంచి తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న యశ్వంత్ సిన్హా ప్రస్తుతం మరికొన్ని నెలలో జరగనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సొంతంగా ‘అటల్ విచార్ మంచ్’ అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు.
బీజేపీయే టార్గెట్
ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యశ్వంత్ సిన్హా బీజేపీని ఎదుర్కోవాలనే లక్ష్యంతో తన సొంత నియోజకవర్గ ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. స్నేహితులు, సన్నిహితుల అభిప్రాయం తీసుకుని అటల్ విచార్ మంచ్ అని పేరుతో నూతన రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. యశ్వంత్ సిన్హా మొదటినుంచి వాజ్ పేయి సిద్ధాంతాలన్నా..ఆయనన్నా అమితమైన అభిమానం చూపిస్తుండేవారు. కానీ మోదీ విధానాలతో ఎప్పుడూ రాజీపడేవారు కాదు. అనేక సందర్భాలలో మోదీ విధానాలు, ఆయన పథకాలపై విరుచుకుపడుతుండేవారు.
Also Read: విష్ణుగారూ వినండి వీళ్ల గోడు.. టాలీవుడ్లోనూ మృగాలున్నాయ్, కమిటీ వేస్తారా?
అన్ని నియోజకవర్గాల పర్యటన
ఇటీవల ఝూర్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ నియోజకవర్గ పరిధితో ఏర్పాటు చేసి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న యశ్వంత్ సిన్హా తన రాజకీయ పార్టీని ప్రకటించారు. త్వరలో జరగబోయే ఝూర్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. యశ్వంత్ సిన్హా మద్దతుదారులు పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. కుమారుడు బీజేపీలోనే కొనసాగుతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు తప్పేముంది ఒక ఫ్యామిలీలో ఇద్దరూ వేర్వేరు పార్టీలుగా ఉంటే వచ్చిన సమస్య ఏమిటని..ఎవరి సిద్ధాంతాలు వారివి అంటూ సమాధానం చెప్పారు.
ఇకపై ఝార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన జరిపి అటల్ విచార్ మంచ్ ఆశయాలను మరింత విస్తృతంగా ప్రజల ముందర తీసుకెళతానని అన్నారు. ఈ లక్ష్య సాధనలో తనకు అండదండలుగా నిలిచిన సన్నిహితులు, మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉన్నతాశయాల కోసం స్థాపించిన పార్టీ తనది అన్నారు. అవినీతి పరులకు తమ పార్టీలో అనుమతి లేదన్నారు. వారికి టిక్కెట్ కూడా ఇవ్వబోమని స్పష్టం చేశారు.