Tenth class Student died in Alluri district: ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. తరతరాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా, అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పదో తరగతి విద్యార్థికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందింది. జీకే వీధి మండలం దోనుగుమ్మల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. తొలుత గ్రామంలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైంది.
ఈ తరుణంలో స్థానిక పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నిలబడేందుకు సైతం బలం లేకపోవడంతో అంబులెన్స్కి సమాచారం అందించారు. అయితే ఆ విద్యార్థిని పరిస్థితి మరింత క్షీణించడంతో తొందరగా రావాలని చెప్పారు. అయితే దోనుగుమ్మలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో అంబెలెన్స్ వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది.
దీంతో చేసేది ఏమీలేక ఆ విద్యార్థినిని కుటుంబ సభ్యులు డోలీ కట్టి చికిత్స నిమిత్తం డోలీలో ఆస్పత్రికి బయలుదేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే విద్యార్థని మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు రోదనలు కంటతడి పెట్టించాయి.
కాగా, దోనుగుమ్మల గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో రోగులను, నిండు గర్భిణులను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అయితే గ్రామానికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో 108 అంబులెన్స్ రాలేదని, అందుకే డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి ఆ విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఒకవేళ రోడ్డు మార్గం సరిగ్గా ఉంటే.. ఆ విద్యార్థి ప్రాణాలు దక్కేవన్నారు. ఇప్పటికే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.