Road Accident in Rajasthan Sirohi: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరోహిలో ట్రక్కును తుఫాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మృతి చెందగా.. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పింద్వారాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సిరోహి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సమాచారం తెలుసుకున్న పింద్వారా డీఎస్పీ భన్వర్ లాల్ చౌదరి, తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
పిండ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంటర్ పులియా సమీపంలో ఉదయ్ పూర్-పాలన్పూర్ జాతీయరహదారిపై రాత్రి రాంగ్ రూట్లో వస్తున్న తుఫాన్ ఎదురుగా ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తుఫాన్ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. కొంతమంది వాహనంలో ఇరుక్కుపోయారని, స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసినట్లు వెల్లడించారు. వీరంతా ఉగానాసర్, ఉదయపూర్ గ్రామాలకు చెందిన దినసరి కూలీలుగా గుర్తించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తుఫానులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉన్నారు. సిరోహి నుంచి పింద్వారాకు వెళ్తుండగా.. కొంత రోడ్డు కోతకు గురికావడంతో తుఫాను రాంగ్ రూట్ తీసుకుందని, ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారన్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని ఉదయ్ పూర్ ఆస్పత్రికి తరలించామన్నారు.
Also Read: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
అంతకుముందు, బుండి జిల్లాలో ఓ కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారును వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిక తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కోటాకు తరలించారు.
మధ్య ప్రదేశ్ నుంచి సికారులో ఖతు శ్యామ్ ఆలయానికి దర్శించుకునేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంకర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని బండి ఎస్పీ హనుమాన్ ప్రసాద్ మీనా తెలిపారు.