– ఆ జీవోతో తెలంగాణ విద్యార్థులకు నష్టం
– కన్వీనర్ కోటాలో సీట్ల అమ్మాకానికి మంత్రి కుట్ర
– తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ ఇంకెప్పుడు?
– తెలంగాణలో పుట్టిన వారంతా స్థానికులే
– బీఆర్ఎస్ విద్యార్థి సంఘనేత.. గెల్లు శ్రీనివాస్ యాదవ్
GO 33: తెలంగాణ ప్రభుత్వం వెంటనే జీఓ నెం. 33ను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు ఈ డిమాండ్తో ఆదివారం మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ముందుగానే బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, పలువురు విద్యార్థి సంఘ నేతలను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ స్థానిక విద్యార్థులకు మాత్రమే మెడికల్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అమ్ముకునేందుకు ప్లాన్
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ జీవో నెంబర్ 33 ఉపయోగించుకుని వేరే రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు అమ్ముకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల విద్యార్థులకు కన్వీనర్ కోటా సీట్లు అమ్ముకుంటారని ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పై ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ వాసేనని, సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన అప్పీలును వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ జీవో ద్వారా కన్వీనర్ కోటాలోని వందల సీట్లు తెలగాణ విద్యార్థులకు దక్కకుండా పోతున్నాయని పేర్కొన్నారు.
Also Read: TPCC Chief: టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
కౌన్సిలింగ్ ఇంకెప్పుడు?
ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సిలింగ్ రెండవ దశకు చేరుకుందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో మాత్రం కనీసం మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలుకాలేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.. తెలంగాణలో ‘నీట్’ పరీక్ష రాసిన విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఆగమాగం అవుతున్నా, వైద్యారోగ్యశాఖకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని, ఈ నేపథ్యంలో విద్యార్థులకు భరోసా కల్పిస్తూ కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని దుస్థితిలో హెల్త్ యూనివర్సిటీ, వైద్యారోగ్యశాఖలు ఉన్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ యత్నించడంతో పోలీసులు అడ్డుకోగా, విద్యార్థి నేతలంతా క్వార్టర్స్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిమజ్జనం వేళ నిరసనలొద్దని పోలీసులు చెప్పినా వినకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.