Congress: సీనియర్ల తిరుగుబాటు తెలంగాణ కాంగ్రెస్ లో కాక రేపుతోంది. తొమ్మిది మంది సీనియర్లు కలిసి.. భట్టి ఇంట్లో భేటీ అయి.. రేవంత్ రెడ్డిపై రెబెల్ జెండా ఎగరేయడం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ కమిటీల్లో ఆయన అనుచరులకే పదవులు ఇచ్చుకున్నారని.. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారనేది సీనియర్ల ప్రధాన ఆరోపణ. అందుకే, ఒరిజినల్ వర్సెస్ వలస.. వివాదాన్ని రాజేసి కాంగ్రెస్ లో కల్లోలం రేపారు. ఇంతకీ, సీనియర్లు ఆరోపించినట్టు కాంగ్రెస్ కమిటీల్లో వలస నేతలకే ఎక్కువ పదవులు దక్కాయా? టీడీపీ ఫ్లేవర్ ఎక్కువైందా? 108లో 50కి పైగా పదవులు వారికే ఇచ్చారా? ఇందులో నిజమెంత?
కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తోన్న ఆరోపణలకు మరో సీనియర్ లీడర్ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన 22 మంది తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఒక్క రేవంత్ రెడ్డి మినహా.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఒక్కరు కూడా లేరని స్పష్టం చేశారు. ఆ సీనియర్ల ఆరోపణలు అర్థం లేనివంటూ మండిపడ్డారు.
అలాగే, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు ఇద్దరే ఇద్దరు ఉన్నారని చెప్పారు. ఉపాధ్యక్ష పదవిలో 24 మంది ఉంటే, అందులో ఐదుగురే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు ఉన్నారన్నారు. ఇక, 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో కేవలం ఐదుగురే టీడీపీ వలస వాదులని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క జిల్లాకు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు డీసీసీ అధ్యక్షుడిగా లేరని చెప్పారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మెనార్టీలు 68 శాతం ఉంటే.. ఓసీలు 32 శాతం ఉన్నారని వెల్లడించారు మల్లు రవి. తమకేదో అన్యాయం జరిగిపోయిందంటూ.. కొందరు సీనియర్లు కావాలనే రచ్చ చేస్తున్నారని విమర్శించారు.