Sector 36 Movie Real Story: నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల్లో కూడా చాలా కంటెంట్ ఉంటోంది. ముఖ్యంగా థియేటర్లలో చూడలేని వైలెన్స్ను, ఒళ్లు గగ్గుర్పొడిచే సన్నివేశాలను ఓటీటీలో విడుదలయ్యే సినిమాల్లో చూడవచ్చు. అలాంటి ఒక సినిమానే తాజాగా ఓటీటీ ప్రేక్షకుల మందుకు వచ్చింది. అదే ‘సెక్టార్ 36’. విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ మూవీ.. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం ఇంకా చాలామందికి తెలియదు. ఆ నిజమైన సంఘటనల గురించి విన్న తర్వాత మనుషులు ఇంత క్రూరంగా కూడా ఉండగలరా అనే అనుమానం కలుగుతుంది. అలాంటి ఒక కథను డెబ్యూ డైరెక్టర్ అయిన ఆదిత్య నాంబాల్కర్ అద్భుతంగా తెరకెక్కించాడు.
నిథారీ కిల్లింగ్స్
‘సెక్టార్ 36’ మూవీలో విక్రాంత్ మాస్సే.. ప్రేమ్ అనే పాత్రలో కనిపించాడు. ఇందులో తను ఒక సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సినిమాను విక్రాంత్ యాక్టింగ్ నిలబెట్టింది అనడానికి సందేహం లేదు. సీరియల్ కిల్లర్గా తను స్క్రీన్ పైన కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుల్లో వణుకుపుట్టడం ఖాయం. సెప్టెంబర్ 13న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యింది. మొదటి రోజు నుండే ఈ మూవీకి చాలా పాజిటివ్ టాక్ లభించడంతో అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ నొయిడాలోని నిథారీ అనే ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. ఇప్పటికీ ‘నిథారీ కిల్లింగ్స్’ అంటే అక్కడ తెలియనివారు ఉండరు.
Also Read: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం మూవీ.. వామ్మో ఇన్ని ట్విస్టులా?
శవాలను తిన్నారు
2006లో జరిగిన నిథారీ కిల్లింగ్స్.. మొత్తం ఉత్తర ప్రదేశ్నే తిరిగి చూసేలా చేశాయి. అప్పట్లో నొయిడాలో డ్రైనేజ్లో ఒక మనిషి చేయి పడి ఉండడం గమనించారు స్థానికులు. ఆ చేయి వల్ల పోలీసులకు ఏమీ ఆధారాలు దొరకకపోవడంతో దానిని పక్కన పెట్టేశారు. దీంతో స్థానికులే ఈ కేసును ముందుకు తీసుకెళ్లమంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అలా నిథారీ ప్రాంతంలో ముక్కలుముక్కలుగా నరికేసిన మనిషి అవయవాలు చాలా ప్రాంతాల్లో వారికి కనిపించాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బాధితులను ఎత్తుకెళ్లి రేప్ చేసి, మర్డర్ చేసి, ముక్కలుముక్కలుగా నరికేశారనే విషయం బయటపడింది. ఎంతోమంది చిన్నపిల్లలు, మహిళలను కిడ్నాప్ చేసి ఇలా చేశారని తెలిసింది. అంతే కాకుండా ముక్కలుగా నరికిన శవాలను కూడా తిన్నారనే విషయం పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.
వారే నిందితులు
నిథారీకి చెందిన బిజినెస్మ్యాన్ అయిన మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజ్లోనే ఎక్కువగా శవాలు దొరుకుతున్నట్టుగా సీబీఐ గమనించింది. దీంతో తనతో పాటు తన ఇంట్లో పనిచేస్తున్న సురీందర్ కోలిని వారు విచారించారు. ఆ విచారణలో సురీందర్ ఒక సైకో అని, అందుకే అలా హత్యలు చేశాడనే విషయం బయటపడింది. మోనీందర్ కూడా ఈ కేసులో మరో నిందితుడు అని సీబీఐ నిర్ధారించింది. వాళ్లిద్దరూ చిన్నపిల్లలను, మహిళలను కిడ్నాప్ చేసి వారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ వారిని రేప్ చేసి, ముక్కలుముక్కలుగా నరికేసి పక్కనే ఉన్న డ్రైనేజ్లో పడేసేవారని తెలిసింది. ఒకప్పుడు ఈ కేసు గురించి తెలియనివారు కూడా ‘సెక్టార్ 36’ చూసి దీని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సెర్చింగ్ మొదలుపెట్టారు.