OTT Movies: మలయాళ సినిమాలు అనగానే చాలామంది అవి ఫీల్ గుడ్ జోనర్లో ఉంటాయి, హాయిగా సాగిపోతాయి అని అనుకుంటారు. కానీ అలా కాకుండా మలయాళ మేకర్స్ కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులను వేర్వేరు జోనర్లతో ఆశ్చర్యపరుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం విడుదలయిన ‘దృశ్యం’ అనే మలయాళ మూవీ చూసి ఆశ్చర్యపోని ప్రేక్షకుడు లేడు. ఇలా కూడా ఒక మర్డర్ చేయొచ్చా అని అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు. అందుకే ఈ మూవీ చాలా భాషల్లో రీమేక్ అయ్యి అన్నింటిలోనూ హిట్ కొట్టింది. ఇప్పుడు అదే తరహాలో మరొక మలయాళం మూవీ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదే ‘గోళం’ (Golam).
కథ
‘గోళం’ కథ విషయానికొస్తే.. వీ టెక్ సొల్యూషన్స్ అనే ప్రముఖ కంపెనీకి ఎమ్డీగా పనిచేస్తుంటాడు ఐసాక్ జాన్ (దిలీష్ పోతన్). ఒకరోజు జాన్.. తన ఆఫీస్ బాత్రూమ్లోనే చనిపోయి పడుంటాడు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులంతా షాకయ్యి పోలీసులకు సమాచారం అందిస్తారు. ఈ కేసును చేధించడం కోసం ఏసీపీ సందీప్ కృష్ణ (రంజీత్ సజీవ్) రంగంలోకి దిగుతాడు. బాత్రూమ్లో కాలు జారి పడ్డాడని కేసు క్లోజ్ చేయమని తన తోటి అధికారులు చెప్తుంటారు. కానీ అది కేవలం యాక్సిడెంట్ కాదని సందీప్ నమ్ముతాడు. అందుకే ఆ ఆఫీస్లోని ఉద్యోగులను విచారించడం మొదలుపెడతాడు. ముందుగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో అనుమానస్పదంగా ఏమీ ఉండదు.
ఆ ఆఫీస్లో దాదాపు 13 మంది ఉద్యోగులు ఉండగా.. అందరినీ సెపరేట్గా విచారిస్తూ ఉంటాడు సందీప్. కానీ ఎవరూ అనుమానస్పదంగా, తమ బాస్ను హత్య చేసినట్టుగా అనిపించరు. దీంతో వారందరి ఫోన్స్ను చెక్ చేయడం మొదలుపెడతాడు. మొదటిసారి తనకు ఎలాంటి ఆధారం దొరకకపోయినా మరోసారి అందరి ఫోన్స్ కలిపి చెక్ చేసినప్పుడు వారంతా తరచుగా ఒకే డాక్టర్ను కలుస్తున్నారని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ద్వారా తెలుస్తుంది. అతడే సైకియాట్రిస్ట్ డాక్టర్ కురియాకోస్ చెమ్మనమ్ (సిద్ధిక్). వెంటనే సందీప్ వెళ్లి ఆ డాక్టర్ను కలుస్తాడు. అతడిని కలిసిన తర్వాత సందీప్కు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ ఆఫీస్ ఉద్యోగులే తమ ఎమ్డీని హత్య చేశారనే విషయం బయటపడుతుంది. కానీ ఎందుకు చేశారు, అసలు ఎలా చేశారు అనే విషయాలు తెరపై చూస్తేనే మజా వస్తుంది.
Also Read: హోటల్లో అమ్మాయి – పిల్లాడిని ముక్కలు చేసి.. ఈ సీరిస్ చూశాక, గెస్టులు ఘోస్టుల్లా కనిపిస్తారు
‘దశ్యం’ రేంజ్లో
‘దృశ్యం’ తర్వాత ఆ రేంజ్లో మర్డర్ మిస్టరీ మూవీ ఇప్పటివరకు మలయాళంలో రాలేదు. అలాంటి ‘గోళం’ను ఆ మూవీతో పోలుస్తున్నారంటే ఇది ఏ రేంజ్లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ తలచుకుంటే ఒక మనిషిని ప్రూఫ్ లేకుండా చంపవచ్చని, ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని మరోసారి ఈ మూవీ అందరికీ గుర్తుచేస్తుంది. ‘గోళం’లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. దాదాపు 15 ముఖ్య పాత్రలు ఉన్నాయి. అందులో ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించారు. ఈ సినిమా కథ ఒక ఎత్తు అయితే.. దీని స్క్రీన్ ప్లే మరొక ఎత్తు. ఉద్యోగులంతా కలిసి బాస్ను ఎలా హత్య చేశారు అనే ప్లానింగ్ మాత్రం కాసేపు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేయక తప్పదు. ఇలాంటి ఒక మర్డర్ థ్రిల్లర్ను చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న ‘గోళం’ను తప్పకుండా చూడండి.