Amaravati: అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రోజులు, వారాలు, నెలలు, ఏళ్ల తరబడి రాజధాని కోసం పోరాడుతున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు.. అంటూ ఏపీ నుంచి ఢిల్లీ వరకు తమ గోడు విన్నవించుకుంటున్నారు. నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలతో ఇప్పటికే వివిధ రూపాల్లో అమరావతి నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా వినిపించిన రైతులు.. ఈసారి ఢిల్లీలో జై అమరావతి అంటున్నారు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర నిరసన చేపట్టారు. అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ‘ధరణికోట నుంచి ఎర్రకోట’ పేరుతో ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు.. జంతర్మంతర్ దగ్గర ధర్నాకు దిగారు. రాజధాని రైతుల నిరసనకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించనున్నారు. రామ్లీలా మైదానంలో సోమవారం జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో అమరావతి రైతులు సైతం భాగస్వాములు కానున్నారు.
మరోవైపు, అమరావతిని రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశారు అమరావతి రైతులు. మూడేళ్లలో 1100 కేసులు పెట్టారంటూ.. తమకు న్యాయం చేయాలని లేఖలో వేడుకున్నారు. 200 మందికిపైగా రైతులు అమరావతి కోసం ప్రాణత్యాగం చేశారని జేఏసీ నేతలు వివరించారు. ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని అమరావతి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాది ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాలని విన్నవించారు.
అమరావతి రైతులు ఏం చేసినా పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. అన్నిరకాల ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాకే కార్యచరణకు దిగుతున్నారు. సరిగ్గా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీకి చేరుకుని.. నిరసన చేపడుతుండటం వైసీపీకి ఇబ్బందిగా మారింది. అమరావతి ఇష్యూను జాతీయ స్థాయిలో హైలైట్ చేయడంలో రాజధాని రైతులు సక్సెస్ అయ్యారనే అంటున్నారు.