– బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ
– శాంతిభద్రతలు కాపాడడమే మా ఫస్ట్ ప్రయారిటీ
– ప్రతిపక్ష నేతలు అంటే మాకు గౌరవం ఉంది
– లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం
– ఉనికి కొసమే బీజేపీ రాజకీయ డ్రామాలు
– డిప్యూటీ సీఎం భట్టి విమర్శలు
– మంథనిలో ఐటీ కంపెనీ ప్రారంభించిన శ్రీధర్ బాబు
Congress Rule: కౌశిక్, గాంధీ గొడవ, దాడుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. శాంతి భద్రతలును తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. శాసనసభలో అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారని, ప్రతిపక్ష నేతలు అంటే తమకు గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బీజేపీ గురించి మాట్లాడుతూ, ఉనికి కోసమే ఆపార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని విమర్శలు చేశారు. ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని, ప్రజల ఆశయాలను చట్టాలుగా మార్చి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారిని గౌరవించాలని చెప్పారు. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి చేశామని తెలిపారు. కానీ, బీఆర్ఎస్ లక్ష రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీ గురించి గులాబీ నేతలు మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని అన్నారు. రెండు లక్షల పైన ఉన్నవారికి కూడా వెసులుబాటు కల్పించే యత్నం చేస్తున్నామని తెలిపారు భట్టి. ఓడిపోయినా కూడా రోడ్ల మీదకి వచ్చి బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని, భవిష్యత్తులో తెలంగాణని మోడల్గా తయారు చేస్తామని వివరించారు భట్టి విక్రమార్క.
Also Read: NTR: ఎన్టీఆర్ గొప్ప మనసు.. చావు బతుకుల్లో ఉన్న అభిమానికి ధైర్యం చెప్పిన దేవర
ఐటీ కంపెనీ ప్రారంభం
మంథని పట్టణంలో సెంటిలియాన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్రాంచ్ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతమైన మంథనిలో ఐటీ కంపెనీ రావడం ఆనందదాయకమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తాను ఎక్కడున్నా మంథని అభివృద్ధే తన ధ్యేయమని చెప్పారు. కొందరు ఏవేవో మాట్లాడతారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మంచి పని చేసి వారికి సమాధానం ఇస్తానని తెలిపారు. గ్రామీణ యువత ఇలాంటి అవకాశాలను వినియోగించుకుని ఉపాధి కల్పనలో ముందుకు సాగాలని శ్రీధర్ బాబు సూచించారు.