– ప్రజా పాలనా దినోత్సవం అంటున్న రాష్ట్ర ప్రభుత్వం
– కేంద్రమంత్రులకు ఆహ్వాన లేఖలు
– విమోచన దినోత్సవం అంటున్న కేంద్ర ప్రభుత్వం
– సీఎం రేవంత్ రెడ్డికి అందిన పిలుపు
– మజ్లిస్ అంటే భయమా అంటూ బీజేపీ సూటి ప్రశ్న
Telangana Formation: సెప్టెంబర్ 17 వస్తే చాలు.. తెలంగాణలో రాజకీయ మంటలు రాజుకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీకి బీజేపీకి మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో జరుగుతుంటుంది. బీఆర్ఎస్ ఉన్నన్నాళ్లూ సమైక్యతా దినోత్సవం పేరుతో ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజా పాలనా దినోత్సవం పేరుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ఇది ముమ్మాటికీ విమోచన దినోత్సవం అని అంటోంది బీజేపీ. కర్ణాటకలోని జిల్లాల్లో విమోజనం పేరుతో వేడుకలు చేసుకుంటుంటే మనం మాత్రం ఏడాదికో పేరుతో జరుపుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది.
కేంద్రమంత్రులకు కాంగ్రెస్ సర్కార్ ఆహ్వానాలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటిలో పాల్గొనాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లకు లేఖలు రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1948, సెప్టెంబరు 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు.
కేసీఆర్ పాలనలో సమైక్యతా దినోత్సవం
బీఆర్ఎస్ హయాంలో సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరపాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆనాటి వ్యాఖ్యలను బీజేపీ ప్రతీ ఏడాది గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ, కేసీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లూ చేసింది లేదు. మజ్లిస్ పార్టీతో ఉన్న సత్సంబంధాల కారణంగానే కేసీఆర్, విమోచన దినోత్సవం జరపలేదని కమలనాథులు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పేరు మార్చి జరుపుతుండడంపై మండిపడుతున్నారు.
Also Read: HYDRA: త్వరలోనే హైడ్రాకు విశేషాధికారాలు.. ఆర్డినెన్స్, అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు: రంగనాథ్
పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ వేడుకలు
ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. కొన్నేళ్లుగా కేంద్ర సహకారంతో ఉత్సవాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతుండగా, శనివారం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాలకు అందరూ రావాలని కోరారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. నాటి తెలంగాణ చరిత్రను సమాజానికి కళ్ళకు కట్టేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆనాడు ఇస్లాం స్టేట్ ఏర్పాటుకు సన్నద్ధం చేసుకుంటున్న నిజాం ప్రైవేట్ రజాకార్ల సైన్యంపై ప్రజలు వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. పటేల్ చొరవతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో ఒవైసీ ప్రాబల్యం లేదు కాబట్టి అక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారని, తెలంగాణలో ప్రభుత్వం భయపడి నిర్వహించేందుకు వెనుకాడుతోందని మండిపడ్డారు. విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నాడు రోశయ్య ప్రభుత్వాన్ని అడిగిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక పదేళ్లు ఒవైసీకి లొంగిపోయి నిర్వహించలేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏముందని అడుగుతున్నారని, కొంతమంది కుహనా లౌకిక శక్తులు చరిత్రను వక్రీకరంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్లు ముస్లింలే కానీ, ముస్లింలందరూ రజాకార్లు కాదని చెప్పారు. విమోచన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చామని, ఆయన మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారని ఆరోపించారు లక్ష్మణ్.