EPAPER

Khairatabad Ganesh: వీకెండ్ @ ఖైరతాబాద్.. రేపటితో దర్శనాలు బంద్.. బడా గణేష్ పెద్దోళ్ల కోసమేనా ?

Khairatabad Ganesh: వీకెండ్ @ ఖైరతాబాద్.. రేపటితో దర్శనాలు బంద్.. బడా గణేష్ పెద్దోళ్ల కోసమేనా ?

Khairatabad Bada Ganesh: హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులు అనగానే గుర్తొచ్చేవి రెండు. ఒకటి బాలాపూర్ లడ్డూ, రెండవది ఖైరతాబాద్ బడా గణేష్. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ప్రతి ఏటా లక్షల్లో పలుకుతుంది. ఆ లడ్డూని కొన్నవారికి అంతా అదృష్టమే అని భావిస్తారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ విషయానికొస్తే.. 1954లో ఇక్కడ వినాయకచవితి పూజలు మొదలయ్యాయి. తమిళనాడుకు చెందిన విగ్రహ శిల్పి రాజేంద్రన్, అతని బృందంతో విగ్రహ రూపకల్పన జరుగుతుంది.


ఒక్క అడుగుతో మొదలై..

1954లో అప్పటి ఖైరతాబాద్ కౌన్సిలర్ సింగరి శంకరయ్య వినాయకచవితి సందర్భంగా ఒక్క అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి 11 రోజులపాటు పూజలు నిర్వహించారు. అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం విగ్రహం ఎత్తును ఒక్కో అడుగు పెంచుతూ రూపొందిస్తున్నారు. సింగరి శంకరయ్య తర్వాత ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకచవితి ఉత్సవాల ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఇక్కడ చేనేత కార్మికులు భారీ నూలు కండువా, గాయత్రి యజ్ఞోపవీతాన్ని తయారు చేయించి బడా గణనాథుడికి సమర్పిస్తారు.


విగ్రహం ఎత్తు 11 అడుగులకు చేరినపుడు.. బడా గణేష్ ను దర్శించుకునేందుకు భాగ్యనగర నలుమూలల నుంచే కాకుండా.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచీ కూడా ప్రజలు తరలివచ్చారు. బాలాపూర్ లో లడ్డూవేలంపాట మాదిరిగా.. ఇక్కడ లడ్డూ వేలంపాట ఉండదు. కానీ.. కాకినాడకు సమీపంలో ఉన్న తాపేశ్వరం అనే గ్రామం నుంచి ప్రతీఏటా భారీ లడ్డూని తయారు చేసి.. గణనాథుని చేతిలో పెడతారు. 2011 నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. 2013లో 4200 కేజీల లడ్డూ, 2015లో 6000 కేజీల లడ్డూను తయారు చేసి.. గణనాథునికి సమర్పించారు. గణనాథుని చేతిలో ఉంచిన లడ్డూని భక్తులకు ఉచితంగా పంచిపెడతారు.

నెలరోజులు ఆగిపోయిన నిమజ్జనం

బడా గణేష్ నిమజ్జనాల విషయానికొస్తే.. 1960లో గణనాథుడిని ఏనుగుపై ఊరేగిస్తూ తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత 1982లో రెండు పడవలపై బడా గణేష్ ను ఉంచి.. సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేర్చారు. ఒకానొక సమయంలో బడా గణేష్ నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో.. నెలరోజులపాటు ట్యాంక్ బండ్ పైనే గణనాథుడి విగ్రహం ఉండిపోయింది. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన శోభాయాత్ర ఎంతో ఉత్సవంగా, కోలాహలంగా జరుగుతుంది. తీన్ మార్ డప్పులు ఓవైపు, సాంప్రదాయ నృత్యాలు మరోవైపు, కోలాటాలు ఇంకోవైపు.. ఖైరతాబాద్ పక్కనే నెక్లెస్ రోడ్డు ఉన్నా.. భారీ గణనాథుని నిమజ్జనానికి సమయం చాలానే పడుతుంది. వేలసంఖ్యలో భక్తులు గణనాథుని నిమజ్జనంలో పాల్గొంటారు.

Also Read: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

భక్తులపై చిన్నచూపు

ఎంతో భక్తితో ఖైరతాబాద్ గణనాథుణ్ణి దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల్ని.. అక్కడ ఉన్న వాలంటీర్లు, బందోబస్తులో ఉన్న పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. 11 రోజుల్లో.. వచ్చే వారాంతపు రోజుల్లో రద్దీ అమాంతం పెరుగుతుంది. లక్షల్లో భక్తులు దర్శనానికి వస్తుంటారు. వారిని కనీసం ఒక్క క్షణమైనా తనివితీరా గణేషుడిని చూడనివ్వడం లేదు. దేవుడికి దండం కూడా పెట్టుకోనివ్వరా అని అడిగితే.. అంత భక్తే ఉంటే.. మనసులోనే పెట్టుకోవచ్చు.. ఇక్కడి వరకూ రావడం ఎందుకు ? అని పోలీసులు దురుసుగా సమాధానం చెప్తుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.

ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి ఏ రాజకీయవేత్తో వస్తున్నాడంటే చాలు. బారికేడ్లు, భక్తులను కట్టడి చేసేందుకు తాళ్లు కట్టేస్తున్నారు. కనీసం ఆ విఘ్నాధిపతికి నివేదించి పంచే ప్రసాదాన్ని కూడా తీసుకోనివ్వడం లేదు. ఏమని అడిగితే.. ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు.. మా సెక్యూరిటీ రీజన్స్ మాకు ఉంటాయంటున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ ను చూసేందుకు రాజకీయవేత్తలు వస్తున్నారంటే.. భక్తులు తక్కువగా ఉన్న సమయంలో వెళ్లొచ్చు కదా.. బడా గణేష్.. పెద్దోళ్లకు మాత్రమేనా.. మా లాంటి సామాన్యులు ఆయన్ని కాసేపైనా కన్నులారా చూడకూడదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

దర్శనం నిలిపివేత

ఈ ఏడాది 11వ రోజున బడా గణేష్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నేడు, రేపు మాత్రమే దర్శనం ఉంటుందని, సోమవారం దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర, నిమజ్జనం జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. క్రేన్ నంబర్ 4 లేదా 5 నుంచి నిమజ్జనం జరుగుతుంది. వీకెండ్ కావడం, సోమవారం దర్శనాలు ఉండకపోవడంతో గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×