Congress: వందేళ్లకు పైబడిన పార్టీ అంటూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమేనా? ఆ పాత, రోత విధానాలను ఇంకా వదులుకోదా? కప్పల సామెతలా.. ఒకరిని ఒకరు కిందికి లాగేయడమేనా? పార్టీని ఎదగనీయరా? వాళ్లలో వాళ్లు గొడవలతో కాంగ్రెస్ ను ఖతం చేసేస్తారా? ఇవే ఇప్పుడు సగటు కాంగ్రెస్ వాదిలో కలుగుతున్న సందేహాలు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా గ్రూపులే.. ప్రతిపక్షంలో ఉన్నా గ్రూపులే. ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ తీరు మారనే లేదు. పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ. ఆ స్వేచ్ఛను ఎంతగా వాడేసుకోవాలో అంతకంటే ఎక్కువే వాడేసుకుంటారు. పార్టీలో ఎవరికి వారే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక లుకలుకలు మరింత ఎక్కువయ్యాయని అంటారు. ఎక్కడ పార్టీ మొత్తం రేవంత్ చేతిలోకి వెళ్లిపోతుందేమోననే భయం సీనియర్లను వెంటాడుతోందని చెబుతున్నారు. మొదట్లో రేవంత్ ను కోమటిరెడ్డి వ్యతిరేకించారు. ఆ తర్వాత జగ్గారెడ్డి. ఆ తర్వాత వీహెచ్. ఇక కొత్త కమిటీలు వేశాక.. వరుసబెట్టి సీనియర్లంతా రేవంత్ రెడ్డిపై కస్సుమంటున్నారు. కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారంటూ.. అంతాకలిసి రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఒరిజినల్ వర్సెస్ వలస.. వార్ పీక్స్ కు చేరడంతో కాంగ్రెస్ లో మళ్లీ కల్లోలం.
ఏందిది? టీఆర్ఎస్, బీజేపీ జోరు మీదున్న ప్రస్తుత సమయంలో అంతాకలిసి కాంగ్రెస్ ను రేసుగుర్రంగా దూకించాల్సింది పోయి.. వారిలో వారు కమిటీల పేరుతో కలహాలకు దిగడంపై కాంగ్రెస్ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కారుపై పోరులో ఇప్పటికే కాంగ్రెస్ చాలా వెనకబడి ఉంది. బీజేపీ హస్తం పార్టీని దాటేసి.. చాలాదూరం దూసుకుపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే నడుస్తోంది. ఉనికి కోసం పోరాడే దుస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్.
ఇప్పటికీ సంస్థాగతంగా బీజేపీ కంటే కాంగ్రెస్ బలమే ఎక్కువ. గ్రామగ్రామాన హస్తం పార్టీకి భారీ అనుచర గణం ఉంది. బలమైన నాయకులకూ కొదవేమీ లేదు. ఆర్థిక, అంగ బలం మెండు. కావాల్సిందంతా కాస్త ఉత్సాహం.. మరికాస్త నమ్మకం. పార్టీ కేడర్ కు చేతినిండా పని చెప్పగలిగితే.. ఇక వారిని అడ్డుకోవడం ఎవరితరం కాదంటారు. అలాంటిది.. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు లేకుండా.. ఏళ్ల తరబడి నిస్సత్తువగా, నిరుత్సాహంతో ఉంటోంది కేడర్. వారిలో జోష్ నింపాల్సిన నేతలు.. ఇలా గ్రూపులు కట్టి.. వారిలో వారు గొడవ పడుతున్నారు. కాస్త కష్టపడితే అధికారంలోకి వచ్చే సత్తా ఉన్నాకూడా.. సరైన నాయకత్వం, ఐకమత్యం లేకపోవడంతో.. ఏకంగా మూడో స్థానానికి పడిపోవాల్సిన పరిస్థితి. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవాల్సిన దుస్థితి.
గతమెంతో ఘనమైన కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా? కాంగ్రెస్ నేతలు ఇలానే తమలో తాము పోట్లాడుకుంటే.. పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారదా? రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ కు ఇక తిరుగులేదనుకున్నారు చాలామంది. కానీ, అలా జరగడం లేదు. పార్టీలో ఇంకా అదే నిరుత్సాహం. సీనియర్ల సహాయనిరాకరణ, కమిటీ పదవుల కోసం కలహాలు, ఒరిజినల్ వర్సెస్ వలస నేతల వివాదాలు.. ఇలా అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ ను.. కాంగ్రెస్ నేతలే ఖతం చేస్తున్నారనే విమర్శ అయితే ఉంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండగా.. నేతల తీరు మారకపోతే అది పార్టీకే చేటు. వాళ్లకు కూడా.