– చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊచలే
– డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉపేక్ష లేదు
– వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై ఆరా
– సెప్టెంబరు 17 బందోబస్తుపై రివ్యూ
– అన్ని శాఖల సమన్వయం అవసరం
– శాంతి భద్రతల సమీక్షలో డీజీపీ జితేందర్
Law and Order: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూసే వ్యక్తులను ఉపేక్షించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం, సెప్టెంబరు 17 సందర్భంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు.
కీలక అంశాలపై సమీక్ష
సమస్యలను ముందుగానే గుర్తించి, వాటిని నివారించేలా పోలీసు శాఖ పనిచేయాలని డీజీపీ.. ఈ సమీక్షలో సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవటంతో బాటు రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులపై రౌడీ షీట్ తెరవాలని ఆదేశించారు. మహిళలపై, చిన్నారులపై నేరాలపై, సైబర్ నేరాలపై, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అదే విధంగా, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సెల్ఫోన్ దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, ద్విచక్ర వాహనాల చోరీలు, ముఠా నేరాలపై నిఘా పెంచాలని డీజీపీ హెచ్చరించారు. ముఖ్యంగా రాజకీయ గలాటాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని క్లారిటీ ఇచ్చారు. అనంతరం నిమజ్జనం, సెప్టెంబరు 17 కార్యక్రమాలు, తర్వాత రానున్న మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలపై సూచనలిచ్చారు.
నిమజ్జనంపై..
ఈ క్రమంలోనే భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ సమీక్షలో వెల్లడించారు. అన్నిశాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకుల నుంచి మాట తీసుకున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా గణేశ విగ్రహాలుండగా, ఇప్పటికే సగం విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, సెప్టెంబరు 17న వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు. నిమజ్జన వేడుకలను తిలకించే భక్తులను దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు.
సెప్టెంబరు 17న..
ఈ ఏడాది నిమజ్జనం సెప్టెంబరు 17న రావటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. బీజేపీ విమోచన దినోత్సవంగా, కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజున విద్రోహ దినంగా జరుపుతుండటంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. అదే రోజున ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవవాన్ని నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగంగా నేతలు పాల్గొనే కార్యక్రమాల బందోబస్తు తదితర వ్యవహారాలపై ముందే శాఖా పరంగా సమీక్షించుకోవాలని పేర్కొన్నారు.