– మరోసారి తెరపైకి హిందీ వివాదం
– బలవంతంగా హిందీని రుద్దొద్దన్న కేటీఆర్
– అమిత్ షా తీరును తప్పుబడుతూ విమర్శలు
– రియాక్ట్ అయిన రాజాసింగ్
– పదవి పోయేసరికి పిచ్చెక్కినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, స్వేచ్ఛ: మరోమారు హిందీ రగడ మొదలైంది. ఇతర భారతీయ భాషలతో పోటీ పడకుండా దేశంలో హిందీకి ఆదరణ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. హిందీ అనేది సాంకేతికత, ఉపాధితో ముడిపడి ఉందని చెప్పారు. కొత్త యుగం సాంకేతికతలను హిందీతో అనుసంధానించడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు.
కేటీఆర్ విమర్శలు
అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, హిందీని పరోక్షంగా విధించడం వల్ల కోట్లాడి మంది యువకుల జీవితాలు నాశనం అవుతాయన్నారు. కేంద్ర ఉద్యోగాల అర్హత పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్లో ప్రశ్నలు ఉంటే, ప్రాంతీయ భాషల్లో చదివే వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. హిందీని మాత్రమే ప్రమోట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. దేశంలోని 22 అధికారిక భాషల్లో అందికూడా ఒకటని అన్నారు.
Also Read: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
రాజాసింగ్ రియాక్షన్
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అవుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు పదవి లేక పిచ్చి ఎక్కినట్టుందన్నారు. అందుకే అమిత్ షా పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందీ నేర్చుకోవాలని మాత్రమే అమిత్ షా ట్వీట్ చేశారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం వెళ్తే మనం ఏ భాషలో మాట్లాడతామని ప్రశ్నించారు. మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఏ బాషలో మాట్లాడారని కేటీఆర్ను అడిగారు రాజాసింగ్. హిందీ నేర్చుకోవడం వల్ల దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చనేదే అమిత్ షా ఉద్దేశమని చెప్పుకొచ్చారు.