Astrologer Venuswamy| గత కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన జ్యోతిష్యుడు వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో మోసం చేస్తున్నారని వేణుస్వామిపై నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ విచారణలో భాగంగా కోర్టు.. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆదేశించింది.
ప్రధాన మంత్రి ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో జర్నలిస్ట్ మూర్తి పిటీషన్ దాఖలు చేశారు. వేణుస్వామి మోసాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకు తనపై వేణుస్వామి కుట్ర పన్నుతున్నారని పిటీషన్ మూర్తి పేర్కొన్నారు. జర్నలిస్ట్ మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు వేణుస్వామిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవానలి పోలీసులను నిర్దేశించింది.
జాతకాల పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వేణుస్వామి పబ్లిక్ గా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. దీంతో ఆయనపై ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య రెండో పెళ్లి నటి శోభితతో ఎంగేజ్మెంట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ ఏవో గ్రహబలం అని కారణాలు చెప్పారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు కూడా చేశాయి.
ఈ క్రమంలోనే జర్నలిస్ట్ మూర్తి, వేణుస్వామి మధ్య వివాదం మొదలైంది. వేణుస్వామి జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, జర్నలిస్ట్ మూర్తి ఆధారాలతో సహా బయటపెట్టారు. వేణుస్వామి పేరు మీద కోట్లు విలువ చేసే బినామీ ఆస్తులు కూడా ఉన్నాయని మూర్తి నిజాలు బయటపెట్టి వివాదాల జ్యోతిష్యుడికి షాకిచ్చారు.
మరోవైపు ఇదంతా జర్నలిస్ట్ మూర్తి డబ్బు కోసం చేస్తున్నారని.. తనను డబ్బులివ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. వేణు స్వామి కూడా ఎదురు ఆరోపణలు చేశారు. అయితే వేణుస్వామి తనపై ఆరోపణలు చేశారని.. మూర్తి కోర్టులో పిటీషన్ దాఖలు వేశారు.