Harish Rao: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తనకు నీతులు చెప్పడానికి ముందు ఆయన తీరు సరిచూసుకోవాలన్నారు. హరీశ్ రావు తన కంటే సీనియర్ అని, ఆయన తనకు ఓ సూచన చేశాడని వివరించారు. అరికపూడి గాంధీ తన భాష మార్చుకోవాలని సూచించారని గుర్తు చేశారు. కానీ, హరీశ్ రావు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులతో లకారం ఉపయోగించి మాట్లాడారని కామెంట్ చేశారు. కాబట్టి, హరీశ్ రావు కూడా ఆయన భాషను సరిచేసుకుంటే మంచిదని హితవు పలికారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని, నోటికొచ్చినట్టు దూషించాడని గాంధీ అన్నారు. పది సార్లు రెచ్చగొట్టాడని, ప్రజలను, మహిళలను కూడా ఇబ్బంది పెట్టే పనులు చేశాడని తెలిపారు. ఆయన రెచ్చగొట్టడం వల్లే తాను ఆగ్రహానికి గురై మాట్లాడానని, ఒక మాట తప్పుగా మాట్లాడానని వివరించారు. తాను మాట్లాడింది తప్పే.. కానీ, తనను రెచ్చగొట్టడం వల్లే ఆ మాట వచ్చిందన్నారు.
వారు గౌరవం మాట్లాడితే.. తాను ఉపాధ్యాయుడిలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతానని గాంధీ వివరించారు. కానీ, కౌశిక్ రెడ్డి తనను కించపరిచే విధంగా మాట్లాడాడని, కౌశిక్ రెడ్డి తన నివాసంలో మాట్లాడిన ఓ వీడియోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. కౌశిక్ రెడ్డి భాష.. తన భాషతో పోల్చుకుంటే అందరికీ అర్థమవుతుందని, కౌశిక్ రెడ్డి ఎంతటి చౌకబారు మాటలు మాట్లాడడో తెలిసిపోతుందని చెప్పారు. పార్టీల పరంగా విభేదాలు ఉంటాయని, కానీ, కౌశిక్ రెడ్డి వ్యక్తుల పేర్లు పెట్టి మాట్లాడాడని, అందుకే తాను మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Also Read: MLA Kaushik Reddy: కారు రెండు ముక్కలైందా? కౌశిక్ ‘ప్రాంతీయ’ మాట ఎవరిది?
ఇలా ప్రవర్తించడానికి కౌశిక్ రెడ్డిని ఎవరు ప్రోత్సహిస్తున్నారని అరికపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘ఉదయం 11 గంటలకు నా ఇంటికి వస్తా అన్నాడు. రాకుంటే నేనే వస్తానని చెప్పాను. నా మాటలకు కౌశిక్ రెడ్డి సానుకూలంగా స్పందించాడు. హారతితో ఆహ్వానిస్తానన్నాడు. కూర్చుని మాట్లాడుతానని, బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లుదామని చెప్పాడు. ఇవన్నీ కౌశిక్ రెడ్డే అన్నాడు కదా. అందుకే మీడియా సహా అందరి సమక్షంలోనే నేను నీ ఇంటికి వచ్చాను. నువ్వేం చేశావ్. నాపై రాళ్లు విసిరావ్. ఇంట్లో నుంచి పూల కుండీలు విసిరించావ్’ అంటూ అరికపూడి గాంధీ వివరించారు.