Ganesh Nimajjanam 2024: ఈ ఏడాది ట్యాంక్ బండ్ పై వినాయక విగ్రహాల నిమజ్జనాలు లేవని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ఉన్నాయా లేదా అన్నదానిపై అందరూ అయోమయంలో ఉండగా.. తాజాగా సీపీ ఆనంద్ దానిపై క్లారిటీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలను ఆపివేసినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నిమజ్జనాల వేడుకలో 18 వేల మంది పోలీసులు పాల్గొంటారని వెల్లడించారు.
Also Read: హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలు చేయొచ్చా?.. హైకోర్టు కీలక తీర్పు
వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జనాలు కూడా అంతే వేడుకగా జరుపుతారు. ప్రతిఏటా ట్యాంక్ బండ్ పై హుస్సేన్ సాగర్ లో జరిగే నిమజ్జనోత్సవాలను చూసేందుకు వేలాదిమంది తరలి వస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఇక్కడ ప్రధానం. హుస్సేన్ సాగర్ కాలుష్యమవుతోందని, PoP విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. 2021లో ఇచ్చిన ఆదేశాల మేరకే నిమజ్జనాలు చేయాలని స్పష్టం చేసింది.
ఇక వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచినట్లు తెలిపారు.