Train Passenger Falls In Forest| జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరు ఏ చిక్కుల్లో పడిపోతారో విధికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఎవరైనా ఒంటరిగా అనుకోకుండా అడవిలో తప్పిపోతే ఆ వ్యక్తి సురక్షితంగా తిరిగి రావడం ఏదో అద్భుతం జరిగినట్లే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఒక అరుదైన ఘటన నిజజీవితంలో గడిచింది. అడవిలో తప్పిపోయిన ఆ వ్యక్తి ఆ అడవిలో జీవించడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో ఊహిస్తేనే చాలా బాధగా ఉంటుంది.
వివరాల్లోకి వెళ్లే.. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్గుడి ప్రాంతానికి చెందిన రామ్ పహరియా అనే యువకుడు గుజరాత్ లోని ఛాయాపురిలో లేబర్ పని చేస్తున్నాడు. ఇటీవల తన ఇంటికి సెలవు మీద వెళ్లి తిరిగి గుజరాత్ వెళ్లడానికి రైలు ప్రయాణం ఎంచుకున్నాడు. అయితే ఆ రైలు మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది.
Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!
అలా రైలు ప్రయాణం చేస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు రైలులో నుంచి రామ్ పహరియా కిందపడ్డాడు. ఆ ప్రాంతమంతా చుట్టూ అడవి ఉండడంతో అతనికి సాయం చేయడానికి ఎవరూ లేరు పైగా కింద పడడంతో అతని కాలి ఎముక విరిగిపోయింది. అతను కదల్లేని పరిస్థితి సాయంత్రం కాస్తా రాత్రి అయింది. అడవి ప్రాంతం కావడంత కృూర మృగాలు శబ్దాలు వినిపిస్తున్నాయి. భయం భయంగా రామ్ పహరియా రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు.
ఉదయం ఏదో గూడ్స్ రైలు ఆ మార్గం మీదుగా వెళుతోంది. ఆ శబ్దం విని రామ్ పహరియా గట్టిగా అరిచాడు కానీ ఆ రైలు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో రామ్ పహరియా నిస్సహాయంగా ఏడ్చాడు. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా కొడుతోంది. వేడికి తట్టుకోలేక రామ్ పహరియా ఎక్కడైనా సమీపంలో నీడ కోసం వెతికాడు. దూరంగా ఒక చెట్టు కనిపిస్తోంది. దాని నీడలో వెళదామని ప్రయత్నించినా నడవలేని స్థితి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మరొక దానికి గాయాలు. అందుకే పాకుతూ ఒక్కో ఇంచు ఎంతో కష్టంగా దాదాపు 2 గంటలు పాకుతూ ఆ చెట్టు కిందకు చేరాడు.
ఆకలిగా ఉన్నా తినడానికి ఏమీ లేదు కదా.. తాగడానికి చుట్టు పక్కల నీటి చుక్క కూడా లభించలేదు. రామ్ పహరియా ఇక తాను ఇలాగే చనిపోతానేమో అని అనుకున్నాడు. అప్పుడే చెట్టు కింద చీమలు, పురుగులు చూశాడు. ఆకలి తట్టుకోలేక వాటిని తిన్నాడు. తాగడానికి నీరు లేవు. రెండో రోజు అలాగే గడిచిపోయింది. అయితే ఆ భగవంతుడు అతడిపై కరుణించాడు. అక్కడ వర్షం కురిసింది. కానీ ఆ నీటి చుక్కలతో తన దాహం తీర్చుకున్నాడు.
Also Read: భర్త నుంచి ప్రతినెలా రూ.6 లక్షలు భరణం డిమాండ్ చేసిన మహిళ.. మండిపడిన కోర్టు!
ఆ తరువాత మూడో రోజు ఆ చెట్టు అలాగే పడి ఆకలికి అలమటిస్తుండగా.. అక్కడికి దైవదూతల్లా ఇద్దరు వచ్చారు. అక్కడి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురి రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్ రైలు పట్టాల రిపేరు చేయడానికి వచ్చారు. అనుకోకుండా వారి చూపు చెట్టు కింద పడి ఉన్న రామ్ పహరియాపై పడింది. దగ్గరికి వెళ్లి చూడగా.. రామ్ బలహీనంగా కాలికి గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
రామ్ ని పైకి లేపి అతనికి నీరు తాగించి.. జరిగినదంతా తెలుసుకున్నారు. ఆ ఇద్దరు రైల్వే స్టేషన్ ఫోన్ చేసి.. ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలుని ఆపి అందులో రామ్ పహరియాని తీసుకొని రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆంబులెన్స్ లో రామ్ పహరియా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామ్ పహరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని