Telangana: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రకృతి సిద్ధమైన జలవనరులను పునరుద్ధరించి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ఏజెన్సీ) చేపట్టిన కూల్చివేతలపై నేడు దేశవ్యాప్తంగానూ చర్చ జరుగుతోంది. హైడ్రాకు చట్టబద్ధత లేదనే విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నా జనామోదం ఉందనేది మాత్రం స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, పర్యావరణ ప్రేమికులు దీనిని స్వాగతిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, జలాశయాలను చెరపట్టిన ఆక్రమణదారులపైనే కాకుండా జలవనరుల్లో అక్రమ నిర్మాణాలను అనుమతి ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి, వారి నుంచి జరిమానాలు వసూలు చేసి ఖజానాకు జమచేయాల్సిందేననే డిమాండ్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. బుధవారం సాయంత్రం నాటికి నగర పరిధిలోని పలు ప్రాంతాల్లోని చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలను నేలమట్టం చేయగా, 111.72 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అనేక చోట్ల పార్కులు, రోడ్లను ఆక్రమిస్తూ కట్టిన నిర్మాణాలను తొలగించటం జరిగింది.
హైడ్రా మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆ సంస్థ సాంకేతికతను ఆశ్రయిస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా చెరువుల కబ్జాలను ప్రాథమికంగా గుర్తిస్తున్న సంస్థ.. అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా? లేదా? అన్నది తెలుసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. షాద్నగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి వెళ్లారు. రెండు దశాబ్దాల నాడు అక్కడి చెరువులు, పరిసర ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉండేవి? ఇప్పటి పరిస్థితేంటి? వంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. చాలా ప్రాంతాల్లో చెరువుల్లో మట్టి పోసి చదును చేస్తున్న కబ్జాదారులు అనంతరం నిర్మాణాలు చేపడుతున్నారు. గండిపేట, ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాల విషయంలో అదే జరిగింది. సాధారణం కంటే ఎనిమిది నుంచి 15 అడుగుల మేర ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టి, తమ నిర్మాణాలు ఎక్కువ ఎత్తులో ఉన్నందున అవేవీ ఎఫ్టీఎల్ పరిధిలోకి రావని బుకాయిస్తు్న్న వారికి టెక్నికల్ సాక్షాలతో చెక్ పెట్టాలన్నది హైడ్రా తాజా వ్యూహంగా కనిపిస్తోంది. దీని ద్వారా చెరువుల్లో పూడికతీసి, విపత్తుల నిర్వహణ చర్యలూ చేపట్టవచ్చని హైడ్రా భావిస్తోంది.
మరోవైపు, హైడ్రాని విస్తరించటం, బాధ్యతలను వికేంద్రీకరించటం ద్వారా సంస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) వరకు విస్తరించి, మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలనేది సర్కారు ఆలోచనగా ఉంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, సైబరాబాద్ను నార్త్ జోన్గా, రాచకొండను సౌత్ జోన్గా విభజించి, వీటికి జోనల్ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేసి, అనంతరం ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం, పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసే దిశగా పని జరుగుతుండగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టనుంది. తెలంగాణలోని అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేసేందుకు మునిసిపల్ చట్టంలోనూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అక్రమ కట్టడాలు పెచ్చుమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని, వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయటం ద్వారా రాబోయే రోజుల్లో ఈ తప్పు చేసేందుకు నిర్మాణదారులు భయపడతారని ప్రభుత్వం భావిస్తోంది. భవన అనుమతులు జారీ చేసేప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో 10 శాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ వారు నిబంధనలను అతిక్రమిస్తే… ఆ ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకోవటం లేదా ఆ అక్రమ భాగాన్ని కూలగొట్టటం చేస్తోంది. ఇకపై.. దీనికి భిన్నంగా, అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటం గమనార్హం.
హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థనూ సర్కారు ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులను హైడ్రా బందోబస్తుకు వాడాల్సి రావటంతో స్టేషన్లలోని కేసుల పురోగతి దెబ్బతినకుండా ఉండేందుకు ఏకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోది అవుతుంది. మనదేశంలో అచ్చంగా పార్లమెంటు భద్రతను పర్యవేక్షించేందుకు తొలిసారి ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయగా, తాజాగా తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, నార్కొటిక్స్ విభాగాలకు రెండు ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు. హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు. సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్ఎస్వో వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది.
Also Read: Sitaram Yechury: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలివే!
హైదరాబాద్ నగరంలో చెరువులు ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో చెప్పేందుకు దుర్గం చెరువే ఒక మంచి ఉదాహరణ. ఒకప్పుడు 154.27 ఎకరాల్లో విస్తరించి ఉన్న దుర్గం చెరువును 1980 నాటి హుడా రికార్డులు 90 ఎకరాలుగా చెబుతున్నాయి. అదే ఏడాది రూపొందిన జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద 60.27 ఎకరాలను రెసిడెన్షియల్ జోన్ కింద గుర్తించారు. రాజధానిలో 2000లో కురిసిన కుంభవృష్టితో నాడు ఈ చెరువు సమీప ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. అప్పటికే అక్కడ అధికారికంగా 25 అపార్టుమెంట్లు, 79 ఇళ్లు, 14 వాణిజ్యభవనాలు వెలిశాయి. దీనిపై వివాదాలు తలెత్తడంతో ప్రభుత్వ విభాగాలే వాటికి అనుమతులిచ్చాయి. కాబట్టి కూల్చడానికి వీల్లేదని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతిని ఉల్లంఘించిన భవనాలను కూల్చివేయవచ్చని ఆదేశించింది. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా శామీర్పేట్ సరస్సు 1989లో 486 హెక్టార్ల నుంచి 2006 లో 256 హెక్టార్లకు కుదించుకుపోయింది. మొత్తంగా, 1989 – 2001 మధ్యకాలంలో అంటే కేవలం పుష్కర కాలంలో 3245 హెక్టార్ల జలవనరులు రాజధానిలో అదృశ్యమయ్యాయి. 2010 నాటికి హుడా పరిధిలో 500 చెరువులుండగా, 2018 మే నాటికి వాటి సంఖ్య 169కి పరిమితమైంది. వీటిలో ప్రభుత్వ ఆధీనంలోని 62 చెరువుల్లో 25 ప్రైవేట్ సంస్థల యాజమాన్యం కిందకు వెళ్లాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త యాజమాన్యంలో 82 చెరువులున్నాయి. హుస్సేన్సాగర్, కుంట మల్లయ్యపల్లి వంటి కొన ఊపిరితో ఉన్న చెరువులు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి.
అయితే ఇక్కడ ప్రజల భావోద్వేగాలను, ఆవేశాలను ‘హైడ్రా’ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంలోతైన విశ్లేషణ చేస్తే గాని అర్థం చేసుకోలేము. దశాబ్దాల తరబడి ప్రజల తమ కళ్ళముందే తమ ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ స్థలాలు, కుంటలు, నాలాలను నేతలు, వారి అనుచరులను అడ్డుపెట్టుకుని అడ్డంగా ఆక్రమించిన వేళ.. యువత, మేధావులు, ప్రజాసంఘాల వారు.. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏ ప్రయోజనమూ లేకపోయింది. పైగా ఆ ఆక్రమిత స్థలాల్లో అనుమతులు తెచ్చుకుని, అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మించి మధ్యతరగతికి అడ్డంగా అమ్మేసి సొమ్ముచేసుకున్నారు. సామాన్య ప్రజలను నిబంధనల పేరుతో వేధించే అధికారుల పట్ల ప్రజల్లో ఉన్న ఆక్రోషం వ్యతిరేకతగా మారి అక్రమ కట్టడాలను కూలుస్తున్న ‘హైడ్రా’ పట్ల మద్దతు రావడానికి ప్రధాన కారణంగా అర్థం చేసుకోవచ్చు. చివరగా.. ‘హైడ్రా’ అనగానే తమకు హైడ్రోజోవాన్ జాతికి చెందిన మంచినీటి మొక్క గుర్తుకొస్తోందని కొందరు పర్యావరణ వేత్తలు గుర్తుచేస్తున్నారు. ఈ మొక్క శరీరంలో ఏ భాగం తెగిపోయినా తిరిగి పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం కారణంగా దీనికి మరణం ఉండదు. బహుశా అందుకనే ఈ వ్యవస్థకు ‘హైడ్రా’ అనే పేరును ఎంపిక చేసుకున్నారనీ, భవిష్యత్తులో ఇది తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించి పర్యావరణానికి ప్రాణప్రతిష్ట చేయాలని నేడు తెలంగాణ సమాజం కోరుకుంటోంది.
సీనియర్ జర్నలిస్ట్
సదాశివరావు ఇక్కుర్తి