Deepest condolences: ప్రముఖ రాజకీయ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏచూరితో ఆయనకు ఉన్న స్నేహం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు ఓ ప్రకటనను విడుదల చేశారు.
Also Read: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
‘సీతారాం ఏచూరి ఇక లేరనే వార్త తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఏచూరి నాకు ప్రియమైన మిత్రుడు. చాలా ప్రభావవంతమైన ప్రజావక్త ఏచూరి. అంతేకాదు స్పష్టమైన పార్లమెంటేరియన్ కూడా. ఈ నేపథ్యంలోనే ఏచూరి వామపక్ష రాజకీయ భావజాలానికి ప్రాతినిధ్యం వహించినా కూడా మేమిద్దరం స్నేహంగా ఉండేవాళ్లం. మేమిద్దరం ఎప్పుడు చర్చించినా కూడా వివిధ జాతీయ సమస్యల గురించే పరస్పరం చర్చించుకునేవాళ్లం.
సీతారాం మంచి పాఠకుడు. ఏ విషయమైనా ఆయన తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా తెలియజేసేవారు.. విశ్లేషించేవారు.. వాటిపై పూర్తి స్పష్టతను కలిగి ఉండేవారు. అయితే, ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను వాకబు చేసి, ఏచూరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నాను. కానీ, ఇంతలోనే ఆయన ఇక లేరనే వార్త వినాల్సి రావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
Also Read: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలివే!
ఇదిలా ఉంటే.. ఏచూరి మృతిపట్ల పలువురు నేతలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏచూరి గురించి కూనంనేని పలు విషయాలను వెల్లడించారు. విద్యావేత్తగా ఉన్న ఏచూరి సీపీఎం పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేశారన్నారు. అనేక ప్రజా కార్మిక ఉద్యమాలకు ఏచూరి నాయకత్వం వహించారన్నారు. అందుకే ఏచూరికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సీపీఎం, దాని అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఏచూరి ఎదిగారన్నారు. ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటన్నారు. బలమైన రాజకీయ నాయకుడిని దేశం కోల్పోయిందంటూ కూనంనేని కంటతడిపెట్టుకున్నారు.
Also Read: ఈ రూట్లలో నడిచే ‘వందే భారత్’కు ఇక 20 అదనపు కోచ్లు.. వెయిటింగ్ లొల్లి తీరినట్లే!
ఇటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీతారం ఏచూరి మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని మహేశ్ కుమార్ అన్నారు. తెలుగువాడిగా తన రాజకీయ వాణిని జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ చూపిన గొప్ప నాయకుడు ఏచూరి అంటూ పొగిడారు. నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడని, పేదల కోసం జీవితాంతం ఉద్యమాలు చేసిన ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు మహేశ్ కుమార్ గౌడ్.