– నిధుల్లో వాటా పెంచాల్సిందే
– ఫిస్కల్ ఫెడరలిజమ్ కావాల్సిందే
– పార్టీలకు అతీతంగా నిధుల కేటాయింపు
– త్రివేండ్రం కాన్క్లేవ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Union Govt: భారత దేశం ఒక సమాఖ్య రాజ్యమని, రాష్టాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు పోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం కేరళ రాజధాని తిరువనంతపురంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు.
వాటా పెంచాల్సిందే..
రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి అందిస్తున్న పన్నుల ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు 41 శాతం మాత్రమే అందుతున్నదని, దీన్ని కనీసంగా 50 శాతానికి పెంచేలా కేంద్రానికి సిఫారసులు చేయాలని భట్టి విక్రమార్క 16వ ఫైనాన్స్ కమిషన్కు సూచించారు. గతంలో అనేక రాష్ట్రాలు ఈ అంశంపై కేంద్రానికి విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోకపోవటం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశమూ ముందుకు పోతుందని, ఈ విషయంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇన్ని ఆంక్షలా?
సెస్, సర్చార్జీల పేరుతో కేంద్రం వసూలు చేసే నిధులలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాకుండా, పూర్తిగా కేంద్రమే వాడుకుంటోందని భట్టి విక్రమార్క విమర్శించారు. దీంతో పరిమిత ఆర్థిక వనరులతోనే రాష్ట్రాలు సర్దుకోవాల్సి వస్తున్నదని, దీని వల్ల అక్కడ అభివృద్ధి కుంటుబడటమే గాక విలువైన కాలం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన గ్రాంట్ల అంశంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థికసాయం, పన్నులలో వాటా, కేంద్ర సంక్షేమ పథకాల నిధుల కేటాయింపు, వంటి అంశాలలో కేంద్రం పెత్తనంతో దేశం నష్టపోతోందన్నారు. ఫిస్కల్ ఫెడరలిజమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు.
Also Read: Harish Rao arrest: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హరీశ్రావు అరెస్ట్.. ఏ కేసులో అంటే..?
కమిషన్కు సూచనలు
ఈ సమావేశానికి ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో పాటు 12, 14వ ఆర్థిక సంఘాల్లో పనిచేసిన ఆర్థికవేత్తలు, కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్లు జయతీఘోష్, ప్రభాత్ పట్నాయక్, ఎకనమిక్-పొలిటికల్ వీక్లీ మాజీ ఎడిటర్ రామ్మోహన్రెడ్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ కవితారావ్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఆర్.మోహన్, పలువురు ఫెలో రీసెర్చ్ స్కాలర్లు, ఎమిరేటస్ ప్రొఫెసర్లు, వివిధ ఆర్థిక పరిశోధనా సంస్థల డైరెక్టర్లు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సదరన్ స్టేట్స్ కాంక్లేవ్ రిజల్యూషన్స్ పేరుతో 16వ ఫైనాన్స్ కమిషన్కు అందజేశారు.