Tension at Telangana Bhavan: బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు గురువారం తెలంగాణ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని, భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న పోలీసులు భవన్ వద్ద భారీగా మోహరించారు. మహిళా కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో వారిని అడ్డుకున్నారు. అయినా కూడా వారు పోలీసులను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం వారు భవన్ ముందు బైఠాయించి నిరసన చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Also Read: కొత్త చీఫ్ వస్తే.. కమిటీలు కామనే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఫొటోలను దగ్ధం చేశారు. మహిళలపై కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేటీఆర్ లాంటి వాళ్లనే వదల్లేదని, కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా తాజాగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య విమర్శల పర్వం నెలకొన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లిన విషయం తెలిసిందే.
Also Read: ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే.. ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటది?: హరీశ్రావు
అయితే, అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకోగా, గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పెనుగులాట జరిగింది. పలువురు కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొండాపూర్ లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆయనను పరామర్శించారు. ఆ తరువాత అక్కడ నెలకొన్న పరిస్థితులను వారు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ హరీశ్ రావు మండిపడ్డారు.