10 అంశాలు.. పోరాటాలు
– కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు?
– రుణమాఫీ పూర్తయ్యేది ఎప్పుడు?
– రైతు భరోసా ఇచ్చేది ఎప్పుడు?
– 10 అంశాలే అజెండాగా బీజేఎల్పీ మీటింగ్
– 20న రైతు సమస్యలపై దీక్ష
– వరద సాయంపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్
– గ్రూప్ తగాదాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
Telangana BJP: పది అంశాల అజెండాతో బీజేఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడెం నగేష్ హాజరయ్యారు. అలాగే, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. బీజేపీలో గ్రూప్ తగాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశంలో కీలక విషయాలపై చర్చించినట్టు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
పది అంశాల అజెండాతో సమావేశం నిర్వహించామని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని సీఎంకు లేఖ రాయాలని డిసైడ్ చేశామని, రుణమాఫీ కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. అందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా అమలు చేయాలని చెప్పారు. రైతు సమస్యలపై ఈ నెల 20న దీక్ష చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల మధ్య సఖ్యత లేదని, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్పై చర్చించామని, ఎండోమెంట్ భూములు తిరిగి అప్పజెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్న దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు ఏలేటి.
బీజేఎల్పీ సమావేశం సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, 2003 గుజరాత్లో మోదీ ముఖ్యమంత్రిగా డీమాల్యూషన్ డ్రైవ్ జరిగిందన్నారు. అక్కడ ఒక ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లి అమలు చేశారని గుర్తు చేశారు. కులం, మతం, ఉన్నోడు, లేనోడు అని లెక్కలు వేయకుండా నిర్వహించారన్నారు. ఆ డ్రైవ్తో గుజరాత్లో మోదీ సక్సెస్ అయ్యారని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. అయితే, తెలంగాణలో హైడ్రా ప్రణాళిక ఎంటి? ముఖ్యమంత్రి ఏం చేయాలని అనుకుంటున్నారని అడిగారు అరవింద్. పాతబస్తీకి వెళ్లడానికి ప్యాంట్లు తడుస్తున్నాయా, రెండు రోజులకు ఒకసారి హైడ్రా పద్ధతులు మారుతున్నాయని మండిపడ్డారు. సెలెక్టెడ్ కాదు, సెక్యులర్ పద్ధతిగా ముందుకు వెళ్లాలని సూచించారు. చెరువులు కాపాడటం తప్పు కాదు కానీ, హుస్సేన్ సాగర్ నలు వైపులా నిర్మాణాలు ఉన్నాయి వాటిని కూడా కూలుస్తారా? అని ప్రశ్నించారు.