PT Harassment : ఆడపిల్లలకు మగాళ్ల దగ్గరే కాదు.. మహిళల వద్ద కూడా రక్షణ లేని రోజులివి. సొంతవాళ్లనే నమ్మలేని రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. విద్యార్థినులకు మృగాళ్ల నుంచి ఎలా తమని తాము కాపాడుకోవాలో చెప్పాల్సిన పీటీ.. వారిని వేధించడం మొదలుపెట్టింది. సాటి ఆడది అయ్యుండి ఇలాంటి పనులా చేసేది అంటూ.. విద్యార్థినులు రోడ్డెక్కారు. పీటీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది ఈ దారుణ ఘటన. 500 మందికి పైగా విద్యార్థినులున్న గురుకులంలో కేవలం రెండే బాత్రూమ్ లు ఉన్నాయి. విద్యార్థినులు తమకు పీరియడ్స్ వచ్చిన సమయంలో.. బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా పీటీ అసభ్యంగా ప్రవర్తిస్తోందని వాపోయారు. ఎందుకు లేట్ చేస్తున్నారని అరుస్తూ బాత్రూమ్ డోర్ పగలగొట్టి ఫోన్ లో వీడియోలు రికార్డు చేసి.. పీటీ జోత్స్న తమను కొడుతోందని ఆరోపించారు.
Also Read: దమ్ముంటే రా.. చూసుకుందాం, కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ వీరంగం
గురుకులంలో బైపీసీ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థినులు.. పీటీ జోత్స్న చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న సమయంలో జోత్స్న పెట్టే ఇబ్బందులను భరించలేకపోతున్నామని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. సిరిసిల్ల – సిద్ధిపేట ప్రధాన రహదారిపై కూర్చుని ఆందోళన చేశారు.
పీటీ జోత్స్న తమను కొట్టిన దెబ్బలను చూపిస్తూ.. విద్యార్థినులు కంటతడి పెట్టుకున్నారు. ఆ సైకో టీచర్ ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తుండగా.. ఎంఈఓ రఘుపతి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినుల సమస్యలను విన్న ఎంఈఓ.. డీఈఓకు విషయం చెప్పగా.. వెంటనే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.