KTR Fires on Congress Government: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పట్టపగలు ఎమ్మెల్యేపై హత్యాయత్నమా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు అడ్డాగా మారుస్తుంటే బాధేస్తుందన్నారు. ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు.
మన రాష్ట్రం ఎటు పోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేలకు సైతం రక్షణ లేకుండా పోతుందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి న్యాయపరంగా పోరాడుతున్నారన్నారు. అయితే ఆయనపై టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించారు.
కావాలనే కౌశిక్ రెడ్డిపై దాడి చేయించారని, ఈ దాడి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బీఆర్ఎస్ నాయకులు బెదరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఇంతకుమించి ఘటనలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.