Virat Kohli and Babar Azam To Play In The Same Team:విరాట్ కొహ్లీ – బాబర్ అజామ్ ఇద్దరిని గురుశిష్యులుగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే బాబర్ అంత పాకిస్తానీ అయి ఉండి కూడా విరాట్ కొహ్లీ అంటే తనకెంతో ఇష్టమని, తన ఆట చూసే ఇన్ స్పైర్ అయ్యానని, అలాగే క్రికెట్ లోకి వచ్చానని అంటాడు. అలాగే తన ఆటలోని టెక్నిక్స్ నేర్చుకుని ఇంతవాడినయ్యానని వినమ్రంగా చెబుతుంటాడు. అందుకే తనకి కొహ్లీ గురువులాంటివాడని అంటుంటాడు.
2023 వన్డే వరల్డ్ కప్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో విరాట్ ని కలిసిన బాబర్ అజామ్ తన గుర్తుగా కొహ్లీ జెర్సీని అడిగి తీసుకున్నాడు. అప్పుడు తను నా ఫెవరెట్ క్రికెటర్ అని ఓపెన్ గా చెప్పాడు. ఇవన్నీ ఒకెత్తు అయితే పాకిస్తాన్ లో క్రికెట్ అభిమానులు బాబర్ అజామ్ ఆటతీరుని ఇండియాలో విరాట్ కొహ్లీతో పోల్చి చూస్తుంటారు. పాకిస్తాన్ కొహ్లీగా పిలుచుకుంటారు.
ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే జట్టులో ఆడే అవకాశం రాబోతోంది. మరెంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. విషయానికి వస్తే.. ఆఫ్రో-ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్ ఆటగాళ్లు కలిసి ఆడే అవకాశాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఆఫ్రికన్ క్రికెట్ అసోషియేషన్ ఛైర్మన్ సుమోద్ దామోదర్ చాలా ఇంట్రస్టుగా ఉన్నాడు. మరోవైపు ఐసీసీ ఛైర్మన్గా జై షా రావడంతో.. ఈ టోర్నీ తిరిగి పట్టాలెక్కేలా కనిపిస్తోందని అంటున్నారు.
Also Read: రింకూ, అయ్యర్, శాంసన్: ఈ ముగ్గురిలో చోటెవ్వరికి?
ఈ టోర్నీ గురించి చెప్పాలంటే.. 2005లో తొలిసారి ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో ఆఫ్రికా ఎలవెన్ వర్సెస్ ఆసియా ఎలవెన్ మధ్య పోటీ జరిగింది. ఆసియా ఎలవన్ లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఇక ఆఫ్రికా ఎలెవన్ లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, కెన్యా వంటి దేశాల ప్లేయర్లు ఉంటారు. అలా జరిగితే ఇండియా నుంచి కొహ్లీ, పాకిస్తాన్ నుంచి బాబర్ అజామ్ ఇద్దరికి స్థానం ఉంటుందని అంటున్నారు. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మొదటిసారి 2005లో నిర్వహించిన పోటీలో వీరేంద్ర సెహ్వాగ్, ఇంజమామ్ వుల్ హక్ తదితరులు కలిసి ఆడారు. ఇక 2007లో జరిగిన టోర్నీలో గంగూలీ, ధోనీ సత్తా చాటారు. ఆ తర్వాత మళ్లీ టోర్నీని నిర్వహించలేదు. ఎందుకు? ఏమిటి? అనే అంశాలను పక్కన పెడితే, భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలే కారణమని తెలుస్తోంది. 17 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు. అంతేకాదు టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాల్సిందే.