Duleep Trophy 2024: ఇప్పుడు ఇండియాలో అందరి దృష్టి దులీప్ ట్రోఫీ పైనే ఉంది. ఎందుకంటే ముగ్గురు టీమ్ ఇండియా కీలకమైన ఆటగాళ్ల భవిష్యత్తు.. ఈ టోర్నీపైనే ఆధారపడి ఉంది. బహుశా వీరికిదే ఆఖరి అవకాశం కావచ్చునని అంటున్నారు. ఇక్కడ ఫెయిల్ అయితే, మళ్లీ జాతీయ జట్టులోకి వీరిని తీసుకోవడం అంత ఈజీ కాకపోవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాగే జరిగితే మళ్లీ ఎప్పటిలా రంజీలు, లేకపోతే విదేశీ లీగ్ లు, ఐపీఎల్ ఆడుకుంటూ ప్రూవ్ చేసుకోవాలని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లు గురువారం నుంచి అనంతపురంలో జరగనున్నాయి. ఇండియా-ఎ వర్సెస్ ఇండియా-డి తలపడుతుంటే, మరో మ్యాచ్లో ఇండియా-బి వర్సెస్ ఇండియా-సి మధ్య జరగనుంది. మొన్నటి వరకు జరిగిన తొలి రౌండ్లో దులీప్ ట్రోఫీ అంతా స్టార్ ఆటగాళ్లతో కళకళలాడింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు ఎంపికైన ఆటగాళ్లను ఆయా జట్లు రిలీజ్ చేశాయి. అంతేకాదు వారికి శిక్షణా శిబిరం కూడా స్టార్టయిపోయింది. అందుకని వారందరూ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలోకి వెళ్లిపోయారు. అక్కడ ప్రాక్టీసు షురూ చేశారు.
ఈ నేపథ్యంలో జాతీయ జట్టులో చోటుకోసం తంటాలు పడుతూ, వచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటున్న రింకూ సింగ్ లాంటివాళ్లకి అవకాశం దక్కింది. అలాగే శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సంజూ శాంసన్ రంజీలు, ఐపీఎల్ లో అద్భుతంగా ఆడతాడు. అదే జాతీయ జట్టులోకి వచ్చేసరికి నీరుగారిపోతున్నాడు.
Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?
ఇక శ్రేయాస్ అయ్యర్ అయితే, మరి ప్రాక్టీస్ చేస్తున్నాడో లేదో తెలీదు. తనకి వచ్చినన్ని అవకాశాలు మరెవరికి రాలేదు. ఆకరికి హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా తనని నమ్మి, బీసీసీఐ విధించిన నిషేధం తీయించి శ్రీలంక టూర్ కి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా అవకాశాలను వృధా చేసుకున్నాడు. దీంతో గంభీర్ కూడా తనని వదిలేశాడనే అంటున్నారు.
మరిప్పుడు వీరెలా ఆడతారు? జాతీయ జట్టులో చోటెలా సంపాదించుకుంటారనే అంశంపై వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. అందరూ వీరి ఆటతీరుపై ఆసక్తిగా ఉన్నారు. వీరిలో ఎవరు అదరగొట్టినా సోషల్ మీడియా అదిరిపోవడం ఖాయమని అంటున్నారు.
వీరి ముగ్గురితో పాటు జాతీయ జట్టుకి ఆడిన వారిలో వాషింగ్టన్ సుందర్, రజత్ పటీదార్, పేసర్ నవదీప్ సైనీ, వికెట్ కీపర్ కేఎస్ భరత్ లు ఉన్నారు. వీరందరూ కూడా దులీప్ ట్రోఫీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక శుభ్ మన్ గిల్ వెళ్లిపోవడంతో… ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఇండియా-ఎ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.