Lyricist Guru Charan: తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులను, కళాకారులను కోల్పోయింది. తాజాగా టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ లిరిసిస్ట్ అయిన గురుచురణ్ (77) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 12న తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఒకప్పుడు ఆయన రాసిన పాటలను ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ వింటున్నారు. అందులో చాలా పాటలు క్లాసిక్ హిట్స్గా నిలిచిపోయాయి. ముఖ్యంగా హీరో మోహన్ బాబు అయితే చాలాకాలం పాటు తన సినిమాలో పాటలు రాయాలంటే గురుచరణ్కే ప్రాధాన్యత ఇచ్చేవారు.
క్లాసిక్ పాటలు
గురుచరణ్ అనగానే చాలామంది ప్రేక్షకులకు ‘ముద్ధబంతి పువ్వులో మూగబాసలు’ పాటే గుర్తొస్తుంది. అంతే కాకుండా ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ లాంటి పాటలతో ఆయనకు లిరిసిస్ట్గా మంచి గుర్తింపు లభించింది. ఒకప్పుడు సినిమాల్లో విషాదకరమైన సందర్భాల్లో వచ్చే పాటలు గురుచరణ్ రాస్తేనే బాగుంటుందని చాలామంది మేకర్స్ ఆయనను ఆశ్రయించేవారు. అలా తన కెరీర్లో ఎన్నో సాడ్ సాంగ్స్ రాసి వాటిని క్లాసికల్ హిట్స్ చేశారు గురుచరణ్. పలు తెలుగు హీరోలకు కూడా ఆయన ఫేవరెట్ అయిపోయారు. అందుకే మోహన్ బాబుతో పాటు పలు ఇతర హీరోలు కూడా ఆయనతో పదేపదే కలిసి పనిచేయడానికి ఇష్టపడేవారు.
దర్శకుడి కుమారుడు
గురుచరణ్కు పుట్టుకతోనే సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్నాయి. అలనాటి నటి ఎమ్ ఆర్ తిలకం, అప్పటి ప్రముఖ టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైన మానాపురం అప్పారావుల కుమారుడే గురుచరణ్. తల్లిదండ్రులు ఆయనకు మానాపురపు రాజేంద్రప్రసాద్ అని పేరుపెట్టారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత అది గురుచరణ్గా మారింది. ఎంఏ వరకు చదువు పూర్తిచేసిన గురుచరణ్.. తెలుగులోని ప్రముఖ కవుల్లో ఒకరైన ఆత్రేయ దగ్గర శిష్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. కవిగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో గేయ రచయితగా మారారు. అలా 200కు పైగా సినిమాల్లో అన్ని రకాల పాటలు రాసి మ్యూజిక్ లవర్స్కు దగ్గరయ్యారు.
అన్ని జోనర్లలో పాటలు
ఆయన లిరిక్స్కు చాలా ప్రత్యేకత ఉంటుందని అప్పటి నటీనటులు ప్రశంసించేవారు. అందుకే మోహన్ బాబు కూడా తన ప్రతీ సినిమాలో గురుచరణ్తో కనీసం ఒక్క పాట అయినా రాయించుకునేవారు. మోహన్ బాబులాగానే తనతో ప్రత్యేకంగా పాటలు రాయించుకోవాలి అనుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. చాలామంది హీరోలకు మెలోడీ సాంగ్స్, సాడ్ సాంగ్స్.. ఇలా అన్ని జోనర్లలో గుర్తుండిపోయే పాటలు రాశారు గురుచరణ్. అలాంటి గేయ రచయిత ఇక లేడని తెలియడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుబూతి తెలియజేస్తున్నారు.