Singer Mano Sons: సౌత్లో సింగర్ మనోకు మంచి గుర్తింపు ఉంది. సింగర్గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఆయనకు వేరే లెవెల్లో క్రేజ్ ఉంది. అలాంటి సింగర్ కుమారులపై తాజాగా పోలీస్ కేసు నమోదవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మనో కుమారులు అయిన రఫీక్, సాహీర్.. తన స్నేహితుడితో కలిసి ఇద్దరు వ్యక్తులపై దాడిచేయడంతో చెన్నై పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులోనే ఇదంతా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇక కేసు నమోదు అయిన తర్వాత మనో కుమారులు పరారీలో ఉన్నారని కోలీవుడ్ మీడియా సమాచారం. వారిని అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు ఒక స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
సింగర్గా గుర్తింపు
చెన్నైలోని వలసరవక్కమ్లో శ్రీదేవి కుప్పం ఏకేఆర్ నగర్లో మనో జీవిస్తుంటారు. సౌత్ ఇండియన్ సినిమాలో అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మనో 30 వేలకు పైగా పాటలు పాడారు. తనకు సాహీర్, రఫీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తాజాగా వీరిద్దరూ మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం.. చెన్నై మధురవయిల్లోని ఆలప్పాక్కంలో భారతీదాసన్ నగర్కు చెందిన కృపాకరన్.. ఒక 16 ఏళ్ల కుర్రాడితో కలిసి వలసరవక్కమ్కు వచ్చాడు. తను అదే ఏరియాలో ఉన్న ఫుట్బాల్ స్టేడియంకు వెళ్లగా మనో కుమారులతో పాటు మరికొందరు తనను చుట్టుముట్టారు.
Also Read: నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఛార్జ్ షీట్.. ఎక్కడికైనా వస్తా.. నిరూపిస్తారా? అని హేమ సవాల్!
అక్కడే గొడవ
మనో కుమారుడు రఫీతో పాటు తన స్నేహితులు కూడా ఫుట్బాల్ స్టేడియం దగ్గర ఉన్న గ్రౌండ్లోనే రోజూ క్రికెట్ ఆడతారు. అక్కడ స్థానికులు చెప్పినదాని ప్రకారం క్రికెట్ అయిపోయిన తర్వాత రఫీతో పాటు తన ఫ్రెండ్స్ అక్కడే మద్యం కూడా తాగుతారు. తాజాగా అలాగే మద్యం మత్తులో అక్కడికి వచ్చిన కృపాకరన్తో పాటు తనతో పాటు ఉన్న మైనర్ అబ్బాయిని కూడా వేధించడం మొదలుపెట్టాడు. మెల్లగా తన ఫ్రెండ్స్ కూడా తనకు తోడయ్యారు. అక్కడే ఉన్న మనో పెద్ద కుమారుడు సాహీర్ సైతం రఫీతో చేరి కృపాకరన్పై దాడి చేశాడు. ఈ దాడిలో కృపాకరన్ తలకు గాయాలు కాగా.. మైనర్ అబ్బాయికి కూడా పలు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
పరారీలో కుమారులు
దాడి జరుగుతున్న సమయంలో స్థానికులు జోక్యం చేసుకొని కృపాకరన్తో పాటు తనతో వచ్చిన అబ్బాయిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కావాల్సిన చికిత్స తీసుకున్న తర్వాత కృపాకరన్ వెళ్లి వలసరవక్కమ్ పోలీస్ స్టేషన్లో మనో కుమారులపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మనో కుమారులతో పాటు మొత్తం అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మనో ఇంటికి వెళ్లగా అప్పటికే తన కుమారుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. వారి మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో ఈ దాడికి పాల్పడిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయిదుగురు పోలీసులతో స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేసి మనో కుమారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.