Rs 11637 cr Economic Impact of ODI World Cup 2023 in India: భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఊపిరిలో క్రికెట్ దాగుంది. అప్పటివరకు కొట్టుకున్నవారు ఒక్కసారి క్రికెట్ మ్యాచ్ అనేసరికి కలిసిపోతారు. అదే అందులోని మాయ. ఇంకా మ్యాచ్ టాపిక్ లో పడిపోతారు. ఓటమి గెలుపు విశ్లేషణల్లో అలా కొట్టుకుపోతారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిమతాల్లాగే.. క్రికెట్ కూడా ఒక మతంలా భారతదేశంలో మారిపోయింది. అందులో అన్నివర్గాల ప్రజలు చేరిపోయారు. మాకు క్రికెట్ అంటే ఇష్టం లేదని చెప్పేవారు కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ఎవరు గెలిచారు? అని ఠపీమని అడుగుతారు. అదే ఇండియాలో క్రికెట్ గొప్పతనం.
ఇక ప్రపంచకప్ లాంటి మ్యాచ్ ల్లో ఫైనల్ వరకు ఇండియా వెళితే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ రోజు పనులన్నీ మానుకుని టీవీల ముందు కూర్చుంటారు. అన్నింటికి మించి భారతదేశంలో సగం మంది ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండిపోతారనే పేరుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు కూడా ఆ విషయంలో ఉద్యోగుల్ని ఇబ్బందులు పెట్టరు. అంతలా క్రికెట్ జనంతో మమేకమైపోయింది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. 2023లో వన్డే వరల్డ్ కప్ నకు భారత్ ఆతిథ్యమిచ్చింది. క్రికెట్ ఆడే 10 దేశాల జట్లు పాల్గొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మ్యాచ్ లు నిర్వహించి భారీ ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లకు కూడా స్టార్ హోటళ్లలో విడిది, వారికి నచ్చిన ఫుడ్, టూరిజం, ప్రయాణ ఖర్చులు, రవాణా, పానీయాల అమ్మకాలు ఇలా అన్నింటి ద్వారా ఆయా విభాగాలకు లాభాలు వచ్చి పడ్డాయి.
Also Read: పీటీ ఉష వల్ల వీసమెత్తు ఉపయోగం లేదు: వినేశ్ ఫోగట్
ఒక్క వన్డే ప్రపంచకప్ భారత్ లో నిర్వహించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు అక్షరాలా రూ. 11,637 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఐసీసీ వెల్లడించింది. డాలర్ల రూపంలో చెప్పాలంటే 861.4 మిలియన్ ఆదాయం వచ్చినట్లు తెలిపింది.
ఇకపోతే ప్రపంచకప్ నిర్వహణ కోసం ప్రత్యక్షంగా సుమారు 48 వేల మంది కంటే.. ఎక్కువగా పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగావకాశాలు పొందారని ఐసీసీ పేర్కొంది. ఇక పరోక్షంగా లాభపడినవాళ్ల సంఖ్య లెక్కేలేదని తెలిపింది. ఇక మీడియా రైట్స్, స్పాన్సర్షిపర్ డీల్స్ వల్ల బీసీసీఐకి కూడా భారీగా ఆదాయం వచ్చినట్టు వివరించింది.