Coaching Centers: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా జెట్ స్పీడ్ తో వెళ్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులు, విద్యావేత్తలతో చర్చలు జరుపుతోంది. ఇటీవలే విద్యా కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. దానికి చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించింది. పలు సందర్భాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించేలా మార్పులు తీసుకొస్తామన్నారు. అందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
Also Read: మీది ఉద్యోగం కాదు.. ఉద్వేగం: పోలీస్ పాసింగ్ ఔట్ పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో తీసుకరావాల్సిన సంస్కరణలపై సబ్ కమిటీ ఈ సమావేశంలో తీవ్రంగా చర్చించింది. ఇటు కోచింగ్ సెంటర్ల నిర్వహణలోనూ పాటించాల్సిన మార్గదర్శకాలపై కూడా ఉపసంఘం చర్చించింది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అమలు చేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
Also Read: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తాం. కోచింగ్ సెంటర్లపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాం. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న పలు కోచింగ్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇటు ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల నిర్దారణపై నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ స్కూల్స్ ను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ను వేర్వేరుగా నడపడంతో మానవ వనరుల వృథా అవుతోంది.. అందువల్ల ఈ రెండింటినీ విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించాం’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.