Indian Train passenger Rights: ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది రైలు ప్రయాణం చేసే దేశం భారత్. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరంగా జర్నీ చేసేందుకు ప్రయాణీకులు రైళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి రవాణా వ్యవస్థలో ఉన్నట్లుగానే రైల్వేలోనూ కొన్ని నియామాలు నిబంధనలు ఉన్నాయి. అంతేకాదు, ప్రయాణీకులు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి. ఇంతకీ రైలు ప్రయాణీకులకు ఉన్న 5 హక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. రెండు గంటలైనా వెయిట్ చెయ్యాలి
మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ లో కొన్ని కారణాలతో ఎక్కలేకపోయినా ఫర్వాలేదు. టికెట్ కలెక్టర్ కనీసం ఒక గంట వరకు లేదంటే మీరు ఎక్కాల్సిన స్టేషన్ నుంచి రెండు స్టాప్ లు దాటే వరకు మీరు బుక్ చేసిన సీట్ ను వేరొకరికి కేటాయించకూడదు. ఈ రైట్ వల్ల మీరు ముందున్న రెండు స్టేషన్లలో ఏదో ఒక స్టేషన్ లో రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.
2. తత్కాల్ రుసుం వాపస్
చాలా మంది ప్రయాణీకులకు తెలియని విషయం ఇది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ తత్కాల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుని, పూర్తి స్థాయి అమౌంట్ ను పొందే అవకాశం ఉంది. రైలు 3 గంటలకు పైగా ఆలస్యమైనా, రూట్ లో మార్పు జరిగినా, మీరు తత్కాల్ టిక్కెట్ ను బుక్ చేసినప్పటికీ రీఫండ్ ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
3. ఇతర సందర్భాల్లోనూ..
మరికొన్ని సందర్భాల్లోనూ టికెట్ డబ్బులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయా కారణాలతో రైలు చివరి స్టేషన్ వరకు వెళ్లకపోయినా, రైల్వే సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోయినా, మీరు బుక్ చేసిన టిక్కెట్పై పూర్తి మొత్తాన్ని తిరిగిపొందవచ్చు. రైల్వే సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, మీకు అందులో ప్రయాణీంచడానికి ఇష్టపడకపోతే, టికెట్ సరెండర్ చేసిన తర్వాత మిగిలిన ప్రయాణానికి సంబంధించి డబ్బును వాపసు తీసుకోవచ్చు.
4. ఆటంకం కలిగించకూడదు
రాత్రి 10 గంటల తర్వాత టీసీ ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ సమయంలో ప్రయాణీకులు నిద్రపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, వారిని పదే పదే టికెట్ అడిగి నిద్రకు ఇబ్బంది కలిగించకూడదు. ఆ సమయంలో వారిని టికెట్ అడగకూడదు. రైల్వే సర్వీస్ సిబ్బంది కూడా రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణీకులకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు.
Also Read: ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతి పండక్కి 4 నెలల ముందే రైలు టికెట్ల బుకింగ్
5. వైద్య సహాయం
రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు అస్వస్థత ఏర్పడితే వైద్యసాయం పొందే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి టిక్కెట్ కలెక్టర్ నుంచి మొదలుకొని, రైలు సూపరింటెండెంట్ వరకు ఏ రైల్వే ఉద్యోగి నుంచి అయినా వైద్యసాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అస్వస్థతకు గురైన ప్రయాణీకులకు అవసరమైన వైద్యసాయం అందించడం రైల్వే ఉద్యోగుల విధి. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు తదుపరి స్టాప్ లో నిర్ణయించిన ధరతో వైద్య చికిత్సను అందిస్తుంది.
మీరు కూడా ఆయా పరిస్థితులను బట్టి ఈ 5 హక్కులను పొందే అవకాశం ఉంటుంది. ఈసారి రైలు జర్నీ చేసే సమయంలో ఈ రైట్స్ గుర్తుంచుకోవడం మంచిది. వీలుంటే ఈ హక్కులను వినియోగించుకోవచ్చు.