The fear of Wednesday Haunting the Adilabad District: సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటన ఆ ఊరిని ఇంకా పీడిస్తూనే ఉంది. ఇంకా ఆ భయం నుంచి జనం బయటకు రాలేదు. నాడు జరిగిన ఘటనతో చాలామంది గ్రామాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలివెళ్లారు. కానీ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అయితే నాడు జరిగిన ఘటన బుధవారం జరగడంతో ఊరు.. ఊరంతా బుధవారం హాలీడేను పాటిస్తోంది. ఇంతకీ ఊర్లో జరిగిన కీడేంటీ..?
ఇది అదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం తేజపూర్. సహజ సిద్ధ ప్రకృతికి కేరాఫ్ ఈ ప్రాంతం. అలాంటి చోట మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. 50 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో జరిగిన కీడు ఘటనలతో ఆగ్రామాన్ని షిప్ట్ చేసి కిలోమీటరు దూరంలో ఉన్నప్రాంతానికి వెళ్లారు. ఇక్కడ ప్రస్తుతం 2500 మంది జనాభా నివసిస్తున్నారు. సుమారు 450 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ గ్రామంలో మౌలికవసతులు ఏర్పాటు చేసుకోగా మేజర్ గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఊరు మారినా వారిని భయం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది.
50 ఏళ్ల క్రితం నుంచి బుధవారం రోజున తేజపూర్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. అంతేకాదు.. శ్రావణ, కార్తీక మాసాల్లోనూ బుధవారం ఏదైనా శుభకార్యాలు వచ్చినా చేయరు. ఒకవేళ శుభకార్యాలు తలపెట్టిన విఘ్నం జరుగుతుందని గ్రామస్థులు నమ్ముతారు. ఎంతలా అంటే పెళ్లిళ్లు జరిపితే విడాకులు, బర్త్ డే జరిపితే అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులకు శ్రీకారం చుడితే మధ్యలోనే స్వస్తి చెబుతారని విశ్వసిస్తారు గ్రామస్తులు. ఏదైనా వ్యాపార కార్యకలాపాలు మొదలుపెడితే నష్టాలపాలవుతారు.. నూతన గృహాప్రవేశం చేస్తే అప్పుల పాలవుతారు.. ఈ ఘటనలు గ్రామస్తుల మూఢనమ్మకానికి మరింత అజ్యం పోశాయి.
Also Read: తాగుడుకు బానిసైన పిల్లి ఎంత బరువు పెరిగిందో తెలుసా..చూస్తే అవాక్కవుతారు
50 ఏళ్ల క్రితం బుధవారం తలపెట్టిన శుభకార్యాలకు విఘ్నం ఏర్పడింది. రెండు పెళ్లిళ్లు జరగగా రెండు జంటలకు విడాకులు తీసుకున్నారు. రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఊర్లో బుధవారం రోజున ఏ పని చేసినా అవి విఫలం కావడంతో కీడు జరుగుతుందనే భావన వారిలో నెలకొంది. అందుకే శుభకార్యాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టినరోజు వేడుకలు. వ్యవసాయసాయ పనులు చేయరు.. ఆఖరికి కొత్త బట్టలు కూడా బుధవారం వేసుకోరు ఇక్కడి వారు.
నాటి నుంచి ఈ ఊరు పాటిస్తున్న సంప్రదాయాన్ని నేటి యువత కూడా ఫాలో అవుతుంది. కుల, మతాలకు అతీతంగా గ్రామం మొత్తం కీడు సెంటిమెంట్ కొనసాగిస్తోంది. గ్రామం సుభిక్షంగా, ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నామంటున్నారు స్థానికులు.
టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ కాలంలోను.. ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మడం.. విడ్డూరంగా ఉంది. ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలను పారదొలేందుకు ప్రభుత్వ ఆఫీసర్లు, ఆవేర్ నెస్ ప్రొగ్రామ్స్ తో ప్రజలను చైతన్యవంతులను చేయాలనే పలువురు డిమాండ్ చేస్తున్నారు.