గోల్మాల్ పురి..!
– మరోసారి తెరపైకి చిత్రపురి స్కాములు
– ప్లాట్ల కేటాయింపులో గోల్మాల్
– 21 మందిపై కొత్తగా కేసులు
– మొత్తం 15 కేసుల నమోదు
– ఇప్పటికే కమిటీ అధ్యక్షుడు అనిల్ అరెస్ట్
Film Industry: సినిమా వాళ్ల కోసమే కేటాయించబడిన కాలనీ చిత్రపురి. కానీ, ప్లాట్లు, ఇళ్ల కేటాయింపులు ఇష్టం వచ్చినట్టు సాగాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, అనర్హులకు ఇళ్లు ఇచ్చారని కోర్టు కేసులు కూడా అయ్యాయి. చాలామంది బాధితులు ధర్నాలు కొనసాగించారు. అధికారుల విచారణలు, పోలీసుల దర్యాప్తులు.. ఇలా చిత్రపురి చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. ఆమధ్య కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అరెస్ట్తో డొంకంతా కదులుతుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే, ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ ఎంట్రీతో ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది.
కొత్తగా 21 మందిపై కేసులు
చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. కాలనీ నిర్మాణం, ఫ్లాట్ల అమ్మకాలపై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కస్తూరి ఆనంద్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇదే కేసులో కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ను మే నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వందల కోట్ల లింకులు ఉండటంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి బదిలీ అయ్యింది. చిత్రపురి కాలనీ ఫ్లాట్లను లబ్ధిదారులకి కాకుండా బయటి వారికి అమ్ముకున్నారు. సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులకు కేటాయించారు. ప్రస్తుతం కమిటీపై ఒకేసారి 15 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్. ప్రస్తుత కమిటీ, పాత కమిటీలకు సంబంధించిన మొత్తం 21 మందిపైన కేసులు బుక్ చేసింది. అవి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ 120బీ నమోదు చేసింది.
అసలేంటీ వివాదం?
మణికొండ ఏరియాలో ఉంటుంది ఈ చిత్రపురి కాలనీ. సినిమా వాళ్లకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించి కమిటీ సభ్యులుగా మొదట్లో పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, చంద్ర మధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డితో పాటు పలువురిని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా అనిల్ కొనసాగారు. అయితే, ఇళ్ల కేటాయింపుల్లో, భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 160 మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు కేటాయించలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన వారంతా విసుగు చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటే ఫ్లాట్ను ఇద్దరు, ముగ్గురికి కేటాయించినట్టు బాధితులు చెబుతున్నారు. మాదాపూర్కు చెందిన తోట శ్రీపద్మ దగ్గర 12 లక్షలు తీసుకుని ఇల్లు అలాట్ చేశారు. కానీ, అదే ఫ్లాట్ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా చాలామందికి జరిగినట్టు విచారణలో తేలింది.
Also Read: HYDRA: ఇప్పటివరకు హైడ్రా ఎన్ని బిల్డింగ్లను కూల్చివేసిందో తెలుసా..?
అధ్యక్షుడు అనిల్ అరెస్ట్తో కీలక మలుపు
చిత్రపురి కాలనీ స్కాంలో ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ను మే నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయగా, అందుకు న్యాయస్థానం అనుమతించింది. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. ఈ స్కాంలో మిగతా సభ్యుల పాత్రపైనా దర్యాప్తు జరిగింది. బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్లింది అన్న కోణంలో విచారణ చేశారు పోలీసులు. భారీగా డబ్బులు చేతులు మారినట్టు గుర్తించారు. బాధితుల ఒక్కొక్కరి నుంచి 4 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేసినట్టు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ రంగంలోకి దిగింది. తాజాగా కేసులు నమోదు చేసింది.
కేసులు నమోదైన వారి లిస్ట్
తమ్మారెడ్డి భరద్వాజ
పరుచూరి వెంకటేశ్వరరావు
అనిల్ కుమార్ యాదవ్
కొంగర రామకృష్ణ
కాదంబరి కిరణ్
వీవీ ప్రసాద్
వినోద్ బాల
దోరా సత్యనారాయణ
ప్రవీణ్ యాదవ్
లలిత
దీప్తి వాజ్పేయి
బత్తుల రథు
నిమ్మగడ్డ అనిత
మధుసూదన్ జెల్లా
మహేంద్ర రెడ్డి
కృష్ణ మోహన్ రెడ్డి
చంద్రమధు
రాజేశ్వర్ రెడ్డి
దేవినేని బ్రహ్మానందరావు
కొల్లి రామకృష్ణ
ఉదయ భాస్కర్