Bandi Sanjay: అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. శేరిలింగంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలులో వేయడం రేవంత్కు సాధ్యం కావడం లేదన్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మాట్లాడుకుని వచ్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన దశమ గ్రహమని, నవగ్రహాల పూజలు చేయడం విడ్డూరమని సెటైర్లు వేశారు. వరదలతో జనం అల్లాడుతుంటే ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్న బండి, ఇక రీ ఎంట్రీ కలేనని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామా ఆడుతోందని విమర్శించారు. దేశ ప్రజలారా కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండని పిలుపునిచ్చారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను తాను సన్మానిస్తానని అన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదేనన్న సంజయ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
Also Read: ఉప ఎన్నికలకు సిద్ధమా? : కౌశిక్ రెడ్డి
లౌకికవాదులారా జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదని, హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరని నిలదీశారు. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు తన దృష్టిలో భారతీయులే కాదని స్పష్టం చేశారు. ఇక, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై స్పందించిన బండి సంజయ్, రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ క్విట్ ఇండియా అంటూ నినదించారు. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.