Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారమంతా చీఫ్స్, టీమ్స్ గురించి కొట్టుకున్న కంటెస్టెంట్స్.. రెండోవారం వచ్చేసరికి కడుపునిండా తిండి తినడం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. మొదటివారం కంటెస్టెంట్స్ను కష్టపెట్టకూడదు అనుకున్న బిగ్ బాస్.. రేషన్ను ఫ్రీగా ఇచ్చారు. ఇక రెండోవారానికి కంటెస్టెంట్స్ అంతా టీమ్స్గా విడిపోవడం వల్ల వారి మధ్య రేషన్ కోసం పోటీ మొదలయ్యింది. నైనికా, నిఖిల్ టీమ్కు మధ్య జరిగిన పోటీకి యష్మీ సంచాలకురాలిగా వ్యవహరించి ఇరు టీమ్స్కు అన్యాయం చేసిందని ప్రోమో చూస్తే తెలుస్తోంది.
వారి మధ్య పోటీ
నిఖిల్ టీమ్ నుండి నాగ మణికంఠ, నైనికా టీమ్ నుండి సీత.. రేషన్ కోసం పోటీకి దిగారు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం యాక్షన్ ఏరియా నుండి వారు సరుకులు తీసుకొని రావాలి. వారు కరెక్ట్గా ఆడుతున్నారా లేదా చూడడం కోసం యష్మీని సంచాలకురాలిగా వ్యవహరించమన్నారు బిగ్ బాస్. ముందుగా యాక్షన్ ఏరియాలో కొన్ని పప్పులు పెట్టి ఉంటాయి. అందులో శనగపప్పు ఏదో గుర్తించి తీసుకురమ్మంటారు బిగ్ బాస్. నాగ మణికంఠ కంటే ముందు రూమ్లోకి వెళ్లిన సీత.. శనగపప్పును తీసుకొచ్చి గెలిచింది. ఇక రెండో రౌండ్లో టమాటాల బుట్టలో ఉన్న యాపిల్ను తీసుకురమ్మని చెప్పగా సీతకంటే ముందు మణికంఠ చేతికి యాపిల్ దొరికింది.
ఇద్దరూ ఫెయిల్
మూడో రౌండ్లో యాక్షన్ ఏరియాలో ఉన్న మరమరాల్లో 250 గ్రాములు తీసుకురమ్మని బిగ్ బాస్ చెప్పారు. దీంతో మణికంఠ, సీత.. ఇద్దరూ యాక్షన్ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి వారికి తోచినంత మరమరాలను నింపుకొని వచ్చారు. నాగ మణికంఠ మాత్రం 250 గ్రాములకు దగ్గర నెంబర్.. అంటే 290 గ్రాములు తీసుకొచ్చాడు. సీత ఏమో 370 గ్రాములు తీసుకొచ్చింది. మణికంఠ విన్నర్ అయినా కూడా ఇద్దరూ కరెక్ట్గా తీసుకురాలేదనే కారణంతో ఇద్దరు ఫెయిల్ అని ప్రకటించింది యష్మీ. ఆ విషయంలో మణికంఠకు కోపం వచ్చింది. ఏది క్లోజ్గా ఉంటే దానిని పరిగణనలోకి తీసుకోవాలి అని మణికంఠ చెప్తుండగానే సంచాలకుడిగా నిర్ణయం ఫైనల్ అని యష్మీ అరిచింది. ‘‘అచ్చం 250 గ్రాములు ఏ మనిషి తెలుసుకోలేడు, మనం రోబోలం కాదు’’ అని మణికంఠ కూడా రివర్స్ అయ్యాడు.
నేను ఒప్పుకోను
‘‘నేను పాయింట్ ఎవరికీ ఇవ్వలేదు. నువ్వే అలా చేయడం అసాధ్యం అన్నప్పుడు నేనెలా పాయింట్ ఇస్తాను’’ అని యష్మీ వాగ్వాదాన్ని కొనసాగించింది. ‘‘ఏది క్లోజ్గా ఉంటే అది తీసుకుంటానని చెప్పారు’’ అని మణికంఠ అంటున్నా వినకుండా ‘‘నా ఇష్టం’’ అంటూ సంచాలకురాలు అనే పొగరు చూపించింది యష్మీ. నేను ఒప్పుకోను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు మణికంఠ. తన ఆటతీరుకు అభయ్ ఫిదా అయ్యాడు. గెలిచినా, ఓడినా ఫైట్ చేశావంటూ ప్రశంసించాడు. అయినా తాను ఓడిపోలేదని మణికంఠ అన్నాడు. ‘‘ఫుడ్ గురించి కొట్టుకోవడం చాలా బాధగా ఉంది’’ అంటూ సీత వాపోయింది. ఏమైందో తెలియదు కానీ ప్రోమో చివర్లో మరోసారి సోనియా తన మొసలి కన్నీళ్లను బయటపెట్టింది. అభయ్, పృథ్వి వెళ్లి తనను ఓదార్చారు.