SI’s Passing Out Parade at Telangana Police Academy: తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 402 మంది పురుషులు, 145 మంది మహిళలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. మహిళా ఎస్సై భాగ్యశ్రీ పరేడ్ కమాండర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్ స్పెక్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బాధితులతో ఫ్రెండ్లీ పోలీస్ గా మెలుగుతూ.. క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీఎస్ పీఎస్సీ ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కుటుంబ పాలనలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షగా మార్చారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పిన సీఎం.. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే సైబర్ క్రైమ్ రేటు కూడా తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలకు స్థానం లేదనే విధంగా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తిచేసుకున్న ఎస్సైలకు సూచించారు. యువతకు తమ ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కళ్యాణ్.. రూ.కోటి విరాళం చెక్కు అందజేత
రాష్ట్రంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకుని నిర్మించిన వాటిని కూల్చడం తన బాధ్యత అన్నారు. కూల్చివేతలపై కోర్టులకు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నా.. న్యాయస్థానాల్లో పోరాటం చేసి గెలుస్తామన్నారు. కబ్జాదారులు ఇకనైనా ఆక్రమణలను విడిచిపెట్టాలని హితవు పలికారు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తే.. భారీవర్షాలు కురిసినప్పుడు వరదలు ఎలా వస్తున్నాయో చూస్తున్నామన్నారు. వాటి ఆక్రమణలతోనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయన్నారు. అందుకే అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రాను తీసుకొచ్చామని తెలిపారు.
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకున్నవారు వెంటనే వాటిని విడిచిపెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా నేలమట్టం కాకతప్పదన్నారు. హైదరాబాద్ నీటి కాలుష్యమంతా నల్గొండను ముంచెత్తుతోందని, అందుకే మూసీ నది ప్రక్షాళనను చేపట్టామని సీఎం వెల్లడించారు.