Godavari Floods in Godavari Districts : మొన్నటి వరకూ వరద పోటుతో.. ఉరకలెత్తిన కృష్ణమ్మ శాంతించింది. దీంతో హమ్మయ్య.. అని అందరూ ఊపిరి పీల్చుకున్నారో లేదో.. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు అటు ధవళేశ్వరం, ఇటు భద్రాచలం వద్ద గోదావరికి వరద తాకిడి పెరుగుతోంది. తమ్మిలేరు, ఏలేరుకు వరద పోటు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండిపడే ప్రమాదం ఉండటంతో ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలను అడ్డువేసి కాలువకు గండిపడకుండా ఉండేలా పనులు చేస్తున్నారు.
మరోవైపు కోనసీమ జిల్లాలోనూ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో.. జిల్లా కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వైనతేయ, వశిష్ఠ, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగుతుండటంతో.. జిల్లాకు భారీ వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు. కనకాయలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్ వే లు ఇప్పటికే నీటమునిగాయి. పడవలపై లంకగ్రామాల ప్రజలు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలేరు వరద పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. కాకినాడ కలెక్టర్ కు ఫోన్ చేసి.. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 62 వేల ఎకరాలు నీటమునిగినట్లు కలెక్టర్ పవన్ కు వివరించారు. అలాగే పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో వరదనీరు రోడ్లపైకి చేరడంతో.. రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు.
Also Read: ఏపీ రాజకీయాలు పడవల చుట్టూ.. వదిలిపెట్టేది లేదన్న సీఎం
ధవళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం గంటగంటకూ పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం నది నీటిమట్టం 13 అడుగులు దాటింది. వరద నీటి ప్రవాహం పెరగడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తి 11 లక్షల 55 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాజోలు దీవిని వరద ముంచెత్తడంతో.. నాలుగు రోజులుగా వరదనీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు.
ఇటు ఏలూరులోనూ వరద బీభత్సం సృష్టిస్తోంది. కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. సరస్సు పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏలూరు – కైకలూరు ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. పెద్ద ఎడ్లగాడి – చిన్న ఎడ్లగాడి మధ్య 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గుండేటి వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండగా.. లంకగ్రామాలు నీటమునిగాయి. దెందులూరు సత్యనారాయణపురంలోనూ వాగు కాజ్ వే పై నుంచి ప్రవహిస్తుండటంతో.. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నేడు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యంగా బుడమేరు, ఏలూరు వరద, ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి ఏలూరు CR రెడ్డి కళాశాలకు చేరుకుంటారు. అటు కైకలూరు- కొల్లేరు వరద ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఏలూరు తంగెల్లమూడి తమ్మిలేరు బ్రిడ్జితోపాటు, వరద ఉద్ధృతిని సీఎం పరిశీలించనున్నారు.