హైదరాబాద్, పల్లెటూరు అన్న తేడా లేదు. ఎక్కడ చూసినా వీధికుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ.. వీధికుక్కల్ని చూస్తేనే జంకుతున్నారు. కొన్ని వీధికుక్కలు ఆకలితో ఎవరు కనిపిస్తే వారి వెంట తిరుగుతూ ఉంటాయి. కానీ.. అవి తమనెక్కడ కరుస్తాయోనని రాళ్లు విసిరి తరిమేస్తూ ఉంటారు.
ఈ ఏడాది హైదరాబాద్ తో పాటు.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని ఘటనల్లో పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ సమయంలో మాత్ర మున్సిపాలిటీ అధికారులు వీధికుక్కల్ని నిర్మూలించేందుకు హడావిడి చేస్తారు. ఆ తర్వాత షరా మామూలే. రోడ్లపై ఎన్ని కుక్కలు తిరుగుతున్నా పట్టించుకోరు. మళ్లీ ఎవరి ప్రాణాలైనా పోతేనో, ప్రభుత్వం సీరియస్ అయితేనో తప్ప కదలరు.
Also Read: పాతబస్తీ కట్టడాలపై హైడ్రా చర్యలేవీ?: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తాజాగా నిజామాబాద్ జిల్లాలో వీధికుక్కలకు 10 నెలల బాలుడు ఆహారమైన ఘటన వెలుగుచూసింది. బాలుడి మృతదేహం లభ్యమైన తీరు.. అందరినీ కలచివేస్తోంది. వింటేనే గుండె చివుక్కుమంటున్న ఈ ఘోర ఘటన బోధన్ లో జరిగింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే లక్ష్మి అనే మహిళ మంగళవారం (సెప్టెంబర్ 10) పట్టణంలో ఉన్న బస్టాండ్ కు సమీపంలో.. పెద్దగా జనసంచారం లేని ప్రాంతంలో రోడ్డుపై తన 10 నెలల బాబుని పడుకోబెట్టి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చి చూస్తే.. బాబు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా జాడ తెలియలేదు.
దాంతో లక్ష్మి బోధన్ పోలీస్ స్టేషన్ లో తన 10 నెలల కొడుకు మిస్సైనట్లు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. బాబు కోసం గాలించారు. పరిసర ప్రాంతాల్లో అన్వేషించగా.. పేగులు లభ్యమయ్యాయి. బస్ డిపో పరిసరాల్లో బాలుడి అవయవాలు కనిపించడంతో.. కుక్కలు పీక్కుతిన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. దీంతో బాబును కుక్కలు ఎత్తుకెళ్లి దాడిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లభ్యమైన పేగులు, అవయవాలు చిన్నారివో కాదో తెలుసుకునేందుకు పోలీసులు వాటిని వైద్య పరీక్షలకు పంపారు. అక్కడ రిపోర్ట్ వచ్చాక.. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.