మల్లమ్మా.. నేను ఉన్నానమ్మా..!
– ఎనిమిదేళ్లుగా మరుగుదొడ్డిలోనే నివాసం
– వార్తల్లో చూసి చలించిపోయిన సీఎం రేవంత్
– ఇల్లు మంజూరు చేయాలంటూ ఆదేశాలు
Living Toilet: పేదరికంలో మగ్గుతూ ఎనిమిదేళ్లుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్న మల్లమ్మ అనే వృద్ధురాలి సమస్యపై సీఎం రేవంత్ స్పందించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో నివాసముండే మల్లమ్మ దీనస్థితి గురించి మీడియాలో వచ్చిన కథనాన్ని చూసిన సీఎం ఆమెకు అండగా నిలవాలని వెంటనే అధికారులను ఆదేశించారు.
కష్టాలతో ప్రయాణం..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లిలో నివాసముండే ఏరుళ్ల మల్లమ్మ భర్త 20 ఏళ్ల క్రితమే కన్నుమూశాడు. భర్త మరణం తర్వాత నానా కష్టాలు పడిన మల్లమ్మ, తన రెక్కల కష్టంతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. పదిహేనేళ్ల క్రితం శిధిలావస్థలో ఉన్న తన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో అదే స్థలంలో ఓ చిన్న గుడిసె వేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం అది కూడా పడిపోవడంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రభుత్వం కట్టించిన బాత్రూమ్లోనే తన సామాన్లను పెట్టుకొని అక్కడే వంట వండుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ కూలీ చేసుకుంటూ పూట గడుపుకుంటోంది. దురదృష్టవశాత్తూ ఇద్దరు అల్లుళ్లు మృతి చెందటం, వారికీ సొంతిళ్లు లేక ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం మల్లమ్మ ఒక్కతే ఊళ్లో నివాసముంటోంది. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బాత్రూంలో నీరు చేరి ఆ ఇంట్లోని తిండిగింజలు, సామాను నానిపోగా, ఆ బాత్రూం కూడా శిథిలావస్తకు చేరడంతో భయపడుతూ జీవనం సాగిస్తోంది.
Also Read: MB University: కలెక్షన్ కింగ్.. ఫీజులేమైనా కలెక్షన్లా? మోహన్ బాబు బాగోతం బట్టబయలు!
నీడ కోసం నానా తిప్పలు..
పదేళ్ల నుంచి ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఇళ్లు కట్టిస్తామని చెప్పటమే తప్ప తనకు నీడ ఏర్పడలేదని మల్లమ్మ వాపోయింది. వలస పోయిన తన ఇద్దరు బిడ్డలు ఇల్లు లేకపోవటంతో పండుగలకూ వచ్చి ఒక రోజు ఉండలేకపోతున్నారు మల్లమ్మ వాపోయింది. ప్రభుత్వం స్పందించి తనకు ఒక ఇల్లు మంజూరు చేయాలని కోరింది.
తక్షణ ఆదేశాలు..
మల్లమ్మ గోడు తెలుసుకున్న చలించిపోయిన సీఎం.. వెంటనే ఆమెను పరామర్శించి, ఆమె మంచీచెడులూ చూడటంతో బాటు ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టరును ఆదేశించారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే మనసు తరుక్కు పోతుందని, వీలున్నంత త్వరగా ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు.