Rahul Gandhi: రాహుల్ గాంధీ క్లారిటీతో ఉన్నారు. పాదయాత్ర చేస్తున్నా దేశ రాజకీయాలపై కన్నేసి ఉంచారు. ఆప్ లేకపోయి ఉంటే గుజరాత్ లో కాంగ్రెస్ గెలిచేదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికే బీజేపీతో ఆప్ కుమ్మక్కు అయిందని రాహుల్ విమర్శించారు.
కాంగ్రెస్ శ్రేణులు కాస్త కష్టపడితే మరోసారి రాజస్థాన్ పీఠం కాంగ్రెస్ దే అన్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర 100వ రోజుకు చేరిన సందర్భంగా.. రాజస్థాన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పనైపోయిందని చాలా మంది అంటున్నారని.. కానీ, బీజేపీని ఓడించేది తామేనన్న తేల్చి చెప్పారు. బీజేపీపై పోరాడే సత్తా లేనివారు పార్టీని వీడాలంటూ హాట్ కామెంట్ చేశారు రాహుల్ గాంధీ.
చైనా అంశంపైనా స్పందించారు రాహుల్. భారత్ పై చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. “చైనా నుంచి ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. వారు చొరబాటు కోసం కాదు.. యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని రెండుమూడేళ్లుగా చెబుతున్నా. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాల్లో పట్టీపట్టనట్లు వ్యవహరించడం తగదు. అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్లో వారు ప్రమాదకరంగా సన్నాహాలు చేసుకుంటూ ఉంటే.. మన ప్రభుత్వం నిద్రపోతోంది” అంటూ మండిపడ్డారు. చైనా విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేయడం లేదని విమర్శించారు.