Rana Daggubati Spirit Media: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. పలు చిత్రాలు నిర్మించి ఎందులోనూ తాను తక్కువ కాదని నిరూపించుకుంటున్నాడు. రానా తన స్పిరిట్ మీడియా బ్యానర్పై ఎన్నో తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషా చిత్రాలను తన బ్యానర్పై రిలీజ్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికి బొమ్మలాట, C/o కంచరపాలెం, చార్లీ777, ఇటీవల స్వతంత్ర తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదు సినిమాలతో సహా అవార్డు గెలుచుకున్న మరెన్నో చిత్రాలను నిర్మించి తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.
ఈ స్పిరిట్ మీడియా బ్యానర్పై భారతీయ ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా విభిన్న కథనాలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికే తన బ్యానర్పై ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను తన బ్యానర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి చిన్న సినిమా కాదు. ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్ట్వల్లో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డును అందుకున్న ఒక మలయాళీ-హిందీ ద్విభాషా చిత్రాన్ని భారతదేశంలోని థియేటర్లలో ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధం అయ్యాడు.
ఆ సినిమా మరేదో కాదు పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమాజిన్ అజ్ లైట్’ మూవీ. ఈ మూవీ భారతదేశ డిస్ట్రిబ్యూషన్ హక్కులను రానా దగ్గుబాటి స్థాపించిన స్పిరిట్ మీడియా పొందింది. దీంతో ఈ సినిమా త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: కేన్స్లో భారతీయ దర్శకురాలి ఘనత.. రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కైవసం!
ఆల్ వి ఇమాజిన్ అజ్ లైట్:
ఆల్ వి ఇమాజిన్ అజ్ లైట్ సినిమా ముంబైలోని ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యల నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో కనికృతి, దివ్య ప్రభ, హృదయ హరూన్, ఛాయా కదమ్ వంటి నటీ నటులు ప్రధాన పాత్రలో నటించారు. ఇది కేరళకు చెందిన ఇద్దరు నర్సుల స్టోరీ. ముంబైలోని అస్తవ్యవస్తమైన వీధుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.
ఈ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన ఘనత సాధించింది. ఎంతో మంది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘గ్రాండ్ ప్రిక్స్’ అవార్డును కైవసం చేసుకుంది. ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. మొదటిది ‘పామ్ డి ఓర్’ అవార్డు. కాగా ఈ చిత్రానికి గానూ దర్శకురాలు పాయల్ కపాడియా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా ఇంతటి ఘనత సాధించడం గర్వకారణమనే చెప్పాలి.
దీని కంటే ముందు 1994లో షాజీ ఎన్ కరుణ్ ‘స్వహం’ చిత్రం ‘పామ్ డి ఓర్’ కేటగిరీలో పోటీలో నిలిచింది. ఇప్పుడు ఇన్నేళ్లకు ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీతో భారతీయ సినిమా అరుదైన అవార్డు అందుకుంది. కాగా ఈ సినిమాను 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన తర్వాత ఎంతో మంది చేత ప్రశంసలు అందుకుంది.