16th Finance Commission Meeting With CM Revanth : హైదరాబాద్లోని ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం ప్రారంభమైంది. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగఢియా నేతృత్వంలో భేటీ జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆర్థిక సంఘం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. ఇందులో భాగంగా పలు విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది.
దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
రాష్ట్రంలో బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందన్నారు. రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలని, దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యత నేరవేరుస్తామని వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్ రుణాలతోపాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ను మీ ముందు ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఈ డిమాండ్ నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు మేం సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణను మేం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు.
అలాగే, ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామని, తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నామన్నారు.