Vijayawada Land Slide: విజయవాడ మాచవరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆగస్టు 31న విజయవాడలో కురిసిన భారీ వర్షానికి మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుర్గగుడి ఘాట్ రోడ్డు లోనూ కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని అధికారులు మూసివేశారు. అదే రోజున కురిసిన భారీ వర్షానికి విజయవాడ విలయవాడగా మారింది. మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు.. కృష్ణానదిలో కలిసే వీలులేక ఎదురు ప్రవహించడంతో.. బెజవాడ మునిగిపోయింది. సింగ్ నగర్ తో మొదలైన వరద.. క్రమంగా చుట్టుపక్క ప్రాంతాలకు చేరింది. పీకల్లోతు నీటిలో మునిగిన బెజవాడ వాసులు.. ఇప్పటికీ కష్టపడుతున్నారు.
Also Read: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్
కరెంట్ లేక, తిండిలేక, పిల్లలకు ఇచ్చేందుకు పాలు కూడా లేక ఆకలి కేకలు పెట్టారు. ఆహారాన్ని పంచేందుకు హెలికాఫ్టర్లు, డ్రోన్లతో పాటు ట్రాక్టర్లు, బోట్లను వినియోగించారు. వీలైనంత మేర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బెజవాడ వరద బాధితులకు ఆహారాలను అందించాయి. వరదనీరు తగ్గినా.. దానివల్ల వచ్చిన బురదతో ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అందరికీ మందులు అందజేసింది.